Yadadri Temple | యాదాద్రి చెంతనే ఉన్న మరో అద్భుత క్షేత్రం పాతగుట్ట. దీనిని నరసింహస్వామి విహార క్షేత్రంగా చెబుతారు. నాలుగు శతాబ్దాల కిందటే ఇక్కడ ఆలయం ఉందని అర్చకులు చెబుతారు. 1960 ప్రాంతంలో పాతగుట్ట ఆలయం వెలుగులోకి వచ్చిందంటారు. పాతగుట్ట ప్రాంతంలోని వెంకటాపురం అనే గ్రామం స్వామివారి నివాస స్థలంగా, యాదగిరిగుట్ట కార్యాలయంగా ఉండేది. నరసింహస్వామి లక్ష్మీదేవితో కలిసి పాతగుట్టకు విహారానికి వచ్చేవారని స్థలపురాణం చెబుతున్నది. ఇక్కడ కొలువుదీరిన స్వామిని ప్రత్యక్ష జలధారతో అభిషేకిస్తారు. ఆ జలధార ఎక్కడినుంచి వస్తుందో అంతుబట్టకపోవడం విశేషం. పాతగుట్ట నుంచే స్వామి యాదాద్రికి గుర్రంపై వెళ్లారని స్థానిక కథనం. దీనికి నిరూపణగా పాత ఆలయం నుంచి కొండపైకి ఇప్పటికీ గుర్రపు డెక్కల గుర్తులు కనిపిస్తాయి. కొండపై ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు పాతగుట్టను సందర్శిస్తుంటారు. యాదాద్రి ఆర్టీసీ బస్టాండ్కు 3 కి.మీ. దూరంలో పాతగుట్ట యాదాద్రి ఉంటుంది. సొంతవాహనాల్లో, టాంగాలలో వెళ్లొచ్చు.
అమృత్యుస్సర్వ దృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః
అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహ..!
మృత్యువుకే మృత్యువు అయినవాడు. సర్వతోముఖుడు. సకల జనుల యందు సమదృష్టి కలవాడు. శత్రువులనే మదపుటేనుగులను క్షణకాలంలో సంహరించే భయంకర సింహం లాంటివాడు. ఆశ్రయించే వారికి అభయం ఇచ్చే దేవదేవుడు. పేరుపెట్టి పిలిస్తే చాలు.. పెనుముప్పును దాటిస్తాడు. మనసారా నమ్మినవారికి.. మనోవేదన లేకుండా చేస్తాడు. దీపాన్ని వెలిగించి, శరణుకోరిన వారి సర్వపాపాలూ తొలగిస్తాడు. ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు.. అన్ని రక్షణలనూ కల్పిస్తాడు. ఆయనే అందరినీ కాపాడే సింహదేవుడు!