ప్రతి ఫాల్గుణ శుద్ధపౌర్ణమి సందర్భంగా ‘హోలి’ లేదా ‘వసంతోత్సవం’ జరుపుకొంటాం. ముందురోజు రాత్రి ‘కామ దహనం’ చేసి తెల్లవారి ‘హోలీ వేడుక’లు నిర్వహిస్తాం. వసంతఋతువును ఆహ్వానించే ఉత్సవం కాబట్టి, ‘వసంతోత్సవం’ అనీ, హోలికను నిగ్రహించిన రోజు కనుక, ‘హోలి’ అని దీనిని వ్యవహరిస్తారు.
భారతీయ సాంప్రదాయిక ఉత్సవాలు ఏవైనా వాటిద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని పౌరుల ప్రతిభా వ్యుత్పత్తులు వెలుగుచూస్తాయి. నిజానికి దక్షిణ భారతదేశంలో జరిపే ‘కామ దహనం’, ఉత్తర భారతదేశంలో జరిపే ‘వసంతోత్సవం’ రెండూ ఒక్కటే. దీనినే ‘దుల్ హేతి, ధులండి, ధులెండి’ అని వివిధ ప్రాంతాలవారు పిలుచుకుంటారు. వీటిని దేశమంతా అన్ని ప్రాంతాలవారూ చిన్నా-పెద్దా తేడా లేకుండా ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. హోలి ప్రాశస్త్యాన్ని తెలిపే పలు పౌరాణిక కథలు ప్రచారంలో ఉన్నాయి.
హిరణ్యకశ్యపుడు విష్ణుభక్తుడైన కుమారుని వధించే ప్రయత్నంలో భాగంగా, తన చెల్లెలైన ‘హోలిక’ను, మంటల నుండి రక్షించే శాలువాను ధరింపచేసి, ఆమె ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టి నిప్పు పెట్టిస్తాడు. విష్ణువు అనుగ్రహంతో ప్రహ్లాదుడు రక్షింపబడగా హోలిక మరణిస్తుంది. దీనిని పురస్కరించుకొని ఆ రాక్షసి బొమ్మకు పిడకలు, కట్టెలను పేర్చి, పూజలు నిర్వహించి అనంతరం వాటికి నిప్పంటించడం ఆనవాయితీగా మారింది. కృతయుగంలో తారకాసుర సంహారానికి శివపార్వతులను కలప వలసిన అవసరం ఏర్పడగా, దేవతల ప్రేరణతో శివునిపై కాముడు పుష్పబాణాలు వేస్తాడు. దాంతో కోపించిన శివుడు, మన్మథుని దహించి వేస్తాడు. ఈ మన్మథ దహనాన్నే ‘కామ దహనం’గా ప్రజలు పరిగణిస్తారు.
త్రేతాయుగంలో రఘు మహారాజు పాలనలో దుంధ అనే రాక్షసి పసిపిల్లలను కబళిస్తుంటుంది. నారదుని సలహా మేరకు ఆయన ‘ఫాల్గుణ పౌర్ణమి వ్రతం’ ఆచరిస్తాడు. దీని ప్రభావంతో అతను ఆ రాక్షసిని సంహరిస్తాడు. ఈ సంతోషంలో ప్రజలు ఆ రాక్షసిపై కర్రలు లాంటివి విసిరి, ఆమెను దహించి ఉత్సవం నిర్వహించుకోవడం మొదలైంది. శ్రీకృష్ణుడు ‘తనకు- రాధకు మధ్య శారీరక రంగులో తేడా ఎందుకు వున్నదని’ యశోదను అడుగుతాడు. ఆమె, రాధను ముఖానికి రంగు వేసుకోమంటుంది. అప్పటినుండి అందరూ రంగులు చల్లుకోవడం ఆనవాయితీగా మారిన మరొక కథనమూ వాడుకలో ఉన్నది. ఇలా రంగులు చల్లుకోవడం వెనుక ‘అందరమొకటే’ అనే భావన వ్యక్తమవడం విశేషం. నిజమే, రంగులు భౌతికం, ప్రేమ అభౌతికం!
ఇవి కూడా చదవండి..