ఏకాక్షరం త్వక్షరే త్రాస్తి సోమే
సుషుమ్నాయాం చేహ దృఢీ స ఏకః
త్వం విశ్వభూర్ భూతపతిః పురాణః
పర్జన్య ఏకో భువనస్య గోప్తా ॥
– ఏకాక్షరోపనిషత్తు
‘ఓ పరమాత్మా! నీవు ఏకాక్షరమై ఉన్నావు. నీవు పరబ్రహ్మవు. నీవు ఏకాక్షరంలో నిబిడీకృతమై ఉన్నావు. నీవు శాశ్వతుడవు. ఈ ప్రపంచ పుట్టుకకు కారణమైన వాడవు. పురాణాలలో వర్ణించిన రీతిగా అన్నిటిలో స్థితమై వుండి లోకాన్నంతటినీ రక్షించడానికి వర్షాన్ని కురిపిస్తున్నావు’. కృష్ణ యజుర్వేద సంబంధమైన ఈ వేదాంత సిద్ధాంతాన్ని ‘ఏకాక్షరోపనిషత్తు’ మరింత విపులంగా తెలియజేస్తున్నది.
పృథ్విలోని అణువణువులో నీవున్నావు. ఋషులకు ఆలంబనగా ఉన్నావు. నీవొక బ్రహ్మాండమైన మహాపురుషుడవు. భోనభోంతరాలలో హిరణ్యగర్భుడవై కాంతులు వెదజల్లుతున్నావు. నీవే ఇంద్రుడవు, రుద్రుడవు. చంద్రలోకంలో ఉన్నవాడవూ నీవే. నీవే బ్రహ్మవై ఈ యావత్ విశ్వాన్ని సృష్టించినావు. నీవే గాలివి, నీవే గరుడునివి. నీవు విష్ణువువు, వరాహునివి. రాత్రి, పగలువై వున్నావు. నీవే భూత, భవిష్యత్, వర్తమాన కాలానివి. ‘ఓం’ అంటే వేరేమిటో కాదు, సాక్షాత్తు నీవే. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని నీ నోటితో చెప్పి వున్నావు. నీవు సూర్యలోకంలో కాకుండా మానవకోటి హృదయాలలో వున్న చీకటిని పారద్రోలి వెలుగులు నింపుతున్నావు. నీవే స్త్రీవి, నీవే పురుషుడవు. నీవే బ్రహ్మచారివి, నీవే కన్యవు. నీవే పృథ్వివి, నీవే బ్రహ్మవు. నీవే వరుణునివి, నీవే రాజువు, నీవే సంవత్సరానివి. నీవే అగ్నివి, నీవే సూర్యునివి. సకలం నీవే అయి వున్నావు.
యం.వి.నరసింహారెడ్డి
98491 10922
ఇవి కూడా చదవండి..