Srisailam | శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. నెల రోజుల్లో రూ.3.57కోట్లకుపైగా ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. స్వామి, అమ్మవార్ల ఆలయ హుండీలను బుధవారం అక్కమహాదేవి అలంకార మండపంలో లెక్కించారు. ఈ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆలయ సిబ్బందితోపాటు శివసేవకులు ఉభయ దేవాలయాలు, ఇతర ఆలయాల హుండీలను సైతం లెక్కించారు.
గత 34 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపేణా రూ.3,57,88,078 వచ్చినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. యూఎస్ఏ డాలర్లు 649, ఆస్ట్రేలియా డాలర్లు 440, మలేషియా రింగెట్స్ 50, సింగపూర్ డాలర్లు 10, కెనడా డాలర్లు 70, సౌదీరియాల్స్ 5, ఖతర్ రియాల్స్ 39, యూఏఈ ధీర్హమ్స్ 50తో పాటు తదితర దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ సైతం హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు వివరించారు.
భ్రమరాంబ అమ్మవారికి నిత్య పూజాకైంకర్యాల్లో అలంకరించేందుకు హైదరాబాద్కు చెందిన జీ శ్రీరాములు, రాజేశ్వరి దంపతులు బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. హారం దాదాపు 29 గ్రాముల బరువు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆలయ ఈవో పెద్దిరాజుకు బంగారు హారాన్ని అందజేశారు. అలాగే, సంగారెడ్డికి చెందిన సీ రాములు కుటుంబ సభ్యులతో కలిసి గో సంరక్షణ నిధికి రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఆలయ పర్యవేక్షకురాలు హిమబిందుకు చెక్కును అందజేశారు. దాతలకు మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించి, ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, జ్ఞాపిక అందజేశారు.