Sri Ramanavami Special Chintamadaka Ramalayam | శ్రీరామ నామాలు శతకోటి. దశరథ రాముడిగా తండ్రి మాట నిలబెట్టాడు. సీతారాముడిగా ఆదర్శ భర్తగా నిలిచాడు. కోదండరాముడై దుష్టసంహారం గావించాడు. పట్టాభిరాముడిగా ధర్మబద్ధమైన పాలన కొనసాగించాడు. ఇప్పుడు అదే పట్టాభిరాముడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో కొలువుదీరుతున్నాడు.
శ్రీరామనవమి సందడి చింతమడకలో వారం రోజుల ముందునుంచే మొదలైంది. ప్రతి లోగిలి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. తమ గ్రామంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న రామయ్య తండ్రికి గ్రామస్థులంతా పచ్చని తోరణాలతో స్వాగతం పలుకుతున్నారు. భద్రాద్రి రాముడు తమ ఊరికి వస్తున్నాడని సంబర పడుతున్నారు. చుట్టూ పచ్చని పంటపొలాలు, చెంతనే నిండా నీటితో తొణికిసలాడుతున్న చెరువులు, మధ్యలో శ్వేతసౌధమై వెలిసిన రామాలయాన్ని చూపిస్తూ ‘ముఖ్యమంత్రి అందించిన అరుదైన
బహుమతి’ అని పొంగిపోతున్నారు.
ఏకశిలలో.. ఎన్ని కళలో
నూతన రామాలయం నిర్మించిన ప్రదేశంలో గతంలో హనుమాన్ల గుడి ఉండేది. దీని స్థానంలో పట్టాభిరాముడి ఆలయం నిర్మించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ఇలా సాకారమైంది. మూలవిరాట్ తమిళనాడులోని మహాబలిపురంలో రూపుదిద్దుకుంది. పట్టాభిరాముడి పరివారాన్నంతా ఏకమూర్తిగా తీర్చిదిద్దడం ఇందులోని ప్రత్యేకత. సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత రామచంద్రస్వామితోపాటు బ్రహ్మ, ఈశ్వరుడు, వినాయకుడు, వశిష్ఠ, నారద మునీంద్రుల మూర్తులను ఇమిడ్చిన తీరు అబ్బురపరుస్తుంది. వనవాసం తర్వాత శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన పుష్యమి నక్షత్రంనాడే చింతమడకలో పట్టాభిరాముడి ప్రతిష్ఠ జరుగుతుండటం విశేషం.
ఆరు రోజుల క్రతువు
ఆలయ నిర్మాణానికి 2017లో శంకుస్థాపన చేశారు. తమిళనాడుకు చెందిన 150 మంది శిల్పులు ఈ మహత్కార్యంలో పాలుపంచుకున్నారు. దాదాపు నాలుగున్నర సంవత్సరాలు శ్రమించి ఓ రూపునిచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా ఆరు రోజులుగా విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మంత్రి హరీశ్రావు పర్యవేక్షణలో, శ్రీమాన్ వైద్యం కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఆలయ కమిటీ, చింతమడక గ్రామస్థులు సంఘటితంగా గ్రామోత్సవంగా దీనిని నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల క్రతువులో చివరిగా.. ఈ రోజు విగ్రహ ప్రతిష్ఠాపన. ఆదివారం ఉదయం పలు వైదిక కార్యక్రమాల తర్వాత విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరగనుంది. నేత్రోన్మీలనం, కుంభ ప్రోక్షణ, దృష్టికుంభం, ప్రథమ ఆరాధన వంటి వైదిక క్రతువులు చేపట్టనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని కమనీయంగా నిర్వహిస్తున్నారు.
– కత్తుల శ్రీనివాస రెడ్డి
“Sri Ramanavami Special | శ్రీ రామతత్వమ్ మనకు ఏం బోధిస్తున్నది?”
“శివుడు- విష్ణువు ఒకటే.. వారిద్దరినీ ఎందుకు కలిపి చూడాలో చెప్పే సందర్భాలివే..”
జపం చేసేటప్పుడు జపమాలను చూపుడు వేలుతో ఎందుకు తిప్పకూడదు?