వైకుంఠనాథుడి చల్లని చూపు ప్రసరించే కాలం. దేవతలంతా వేకువ వేళ శ్రీహరిని అర్చించే సమయం. ఉత్తర ద్వారం నుంచి శేషశయనుడిని దర్శించి తరించే పర్వం ‘వైకుంఠ ఏకాదశి’. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ‘ముక్కోటి ఏకాదశి’ని భక్తకోటి కొంగు బంగారంగా భావిస్తుంది. ఖగోళంలో నక్షత్రాలను అనుసరించి విష్ణుతత్తాన్ని విశ్వరూపంగా వీక్షించారు మన రుషులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ విష్ణుతేజాన్ని మనమూ దర్శిద్దాం..
విష్ణువు అంటే వ్యాపనం అని అర్థం. వ్యాపించడమే జీవ లక్షణం. ప్రకృతి ధర్మం. ఇప్పటికే వ్యాపించి ఉన్నది విశ్వం. సర్వత్ర వ్యాపించి, వసించి ఉన్నవాడు వాసుదేవుడు. అంతటా వ్యాపించి ఉన్న శక్తికి రూపాన్నివ్వడం చాలా కష్టం. అయినా భారతీయులు విష్ణువుకు ‘విశ్వరూపాన్ని’ ఇచ్చారు. మన పురాణాలలో విష్ణు అవతార రూపాలు మాత్రమే విశ్వరూపాన్ని చూపించినట్లు గాథలున్నాయి. భారతీయమైన దైవ స్వరూపాలను నక్షత్రాలుగా దర్శించిన రుషులు పురుషసూక్తంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. “అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తమ్- పరమ పురుషునికి అహోరాత్రాలు ఇరువైపులు అయితే, అశ్విన్యాది నక్షత్ర రూపుడే ఆయన” అని అర్థం. నక్షత్రం అంటే నాశనం లేనిది. నాశనం లేనివాడు పరమపురుషుడైన విష్ణువు.
ఖగోళాన్ని నిరంతరం దర్శించడం, వేరు వేరు నక్షత్ర మండలాల ప్రభావాలను అధ్యయనం చేసి, వాటి ఉదయ, అస్తమయ సమయాలను గుర్తుంచుకోవడం భారతీయులు మొదటినుంచీ చేస్తున్న వైజ్ఞానిక కృషి. దీనిని ‘ఖగోళ వేధ’ అనేవారు. ప్రకృతిలో మార్పులకు సూచికగా మన రుషులు నక్షత్రాలను అధ్యయనం చేశారు. అనేక నక్షత్ర మండలాలకు ఇటువంటి కథలు ఉన్నాయి. మనకున్న ‘భ చక్రం’ (రాశి చక్రం)లోని నక్షత్రాల వరుసలో స్వాతి నుంచి శ్రవణం వరకు ఉన్న నక్షత్రాలు ఒక ప్రత్యేకమైన వరుసలో ఉంటాయి. ఈ ఎనిమిది నక్షత్రాల వరుసను జాగ్రత్తగా గమనిస్తే ఆకాశంలో విష్ణురూపం మనకు కనిపిస్తుంది. దీనిని విష్ణు మండలం అంటారు. వైదికంలో ఈ నక్షత్ర మండలాన్ని ఉద్దేశించి అనేక మంత్రాలు ఉన్నాయి. దీనిలో శ్రవణానికి విష్ణువు అధిపతి అయితే, స్వాతి నక్షత్రానికి వాయువు అధిపతి. విష్ణు అవతారాలకు వాయువు తోడుగా ఉన్న విషయం రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది. శ్రీరాముడికి వాయుపుత్రుడైన హనుమంతుడు తోడుంటే, మహాభారతంలో శ్రీకృష్ణుడికి ధర్మ సంస్థాపనలో తోడుగా ఉన్నవాడు వాయుపుత్రుడైన భీముడు.
ఈ నక్షత్రాల వరుసను అనుసరించే మనకున్న వేరు వేరు ఏకాదశులకు రకరకాల పేర్లు వచ్చాయి. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు భూమి నుంచి చూస్తే ఈ నక్షత్రాల వరుస (స్వాతి నుంచి శ్రవణం) విష్ణురూపం పడుకున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే దీనిని ‘శయన ఏకాదశి’గా పిలిచారు. దీనినే తొలి ఏకాదశిగా జరుపుకొంటారు. ఉపవాసాది దీక్షలు చేస్తారు. యతులు చాతుర్మాస్య దీక్ష చేపట్టే సమయం కూడా ఇదే. ఆ తర్వాత ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. ఇక భాద్రపద శుక్ల ఏకాదశి సమయానికి ఈ నక్షత్రాల వరుస భూమి నుంచి చూసినప్పుడు కొంత మార్పు పొందినట్లు కనిపించడం వల్ల దీనికి ‘పరివర్తన ఏకాదశి’ అని పేరు వచ్చింది. పడుకున్నట్లుగా కనిపించే విష్ణువు కొంచెం ఒత్తిగిలి పక్కకు తిరిగినట్టుగా అనిపిస్తుంది. మళ్లీ ఇదే నక్షత్ర రూపం కార్తిక శుక్ల ఏకాదశి నాడు ఉత్తరాకాశంలో ఉదయించినట్లు కనిపిస్తుంది. దీనిని ‘ఉత్థాన ఏకాదశి’గా గుర్తించారు. దక్షిణాకాశంలో ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు పడుకున్న శ్రీమహావిష్ణువు, కార్తిక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని, ఈ నాలుగు మాసాలు విష్ణుస్మరణలో ఉంటూ, మళ్లీ స్వామిని ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించాలని చాతుర్మాస్య వ్రతాలు నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది. ఇక మార్గశిర శుక్ల ఏకాదశి నాటికి సగభాగం అంటే నడుము భాగం వరకు ఉన్న రూపం ఉదయించినట్లుగా కనిపిస్తుంది. ఈ రోజును శ్రీకృష్ణుడు, అర్జునునికి గీతను బోధన చేస్తున్నట్లుగా కనిపించిన రూపం నక్షత్రాలలో ఉండటం వల్ల దీనిని ‘బోధన ఏకాదశి’గా గుర్తించారు. దీనిని ‘గీతా జయంతి’గా మనం ఘనంగా చేసుకుంటాం. నక్షత్ర రూప గీతా బోధకుడు ఆకాశంలో మనకు దర్శనమిస్తుంటాడు.
ఉత్తరాయణం మొదలైన తర్వాత పుష్య మాసంలో వచ్చే ఏకాదశి నాడు ఉత్తరాకాశంలో నక్షత్ర స్వరూపమైన విష్ణువు (స్వాతి నుంచి శ్రవణం వరకు) పూర్ణంగా దర్శనమిస్తుంటాడు. గొప్ప వెలుగులతో రాత్రి వేళల్లో ఆకాశంలో కనిపిస్తాడు. ఈ ప్రత్యేకమైన రోజున వైకుంఠుని పూర్ణ దర్శనం కలగడం వల్ల దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అని పేరు. ముక్కోటి దేవతలు ఆనందంగా ఉండే రోజు కాబట్టి ‘ముక్కోటి ఏకాదశి’ అని, ‘మోక్షద ఏకాదశి’ అని వేరువేరు పేర్లతో పిలవడం సంప్రదాయం. తొలి ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి వరకు ఆకాశంలోని విష్ణు నక్షత్రాలను గమనించడం ద్వారా ఈ ప్రకృతిలోని మార్పులను మనం గమనించే అవకాశం ఉంది.
ఉత్తరాకాశంలో, ఉత్తరాయణంలో నక్షత్ర మండలంలో కనిపించే పూర్ణ విష్ణుమండల స్వరూప దర్శన ఉత్సవమే ‘వైకుంఠ ఏకాదశి’. ఇంట్లో మనం వ్రతాలు చేసుకుంటున్నప్పుడు కట్టుకునే పాలవెల్లి ఆకాశంలో నక్షత్రాలకు ప్రతీక. అదే విధంగా ఉత్తరాకాశంలో కనిపించే నక్షత్ర దర్శనానికి ప్రతీకగా దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ప్రకృతిలో ఒక సమతుల్యత, ప్రశాంతత ఏర్పడే కాలం ఈ ఉత్తరాయణం. ఈ కాలంలో వైకుంఠుని అర్చన చేసుకుని జీవనాన్ని కొనసాగించడం ద్వారా ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయని భారతీయుల విశ్వాసం. దీనికి ప్రతీకనే మనం దర్శించే వైకుంఠుని ఉత్తర ద్వార దర్శనం. ఇది సన్మార్గం. అందరూ ఆచరించే మార్గం. మనమూ దీనిని అనుసరిద్దాం.
– సాగి కమలాకర శర్మ
9704227744