తిరుమల : తిరుమల శ్రీవారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నిన్న ఒకే రోజు రూ.7.68 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి. గత ఏడాది అక్టోబర్ 23వ లభించిన రూ.6.31 కోట్ల హుండీ ఆదాయమే ఇప్పటి వరకు అత్యధికం కాగా.. ఆ రికార్డ్ ఇప్పుడు బ్రేక్ అయ్యింది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి ప్రముఖులు పోటెత్తడంతో ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న ఒకే రోజు 69,414 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 18,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ నెల 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుండడంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.