శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన గురువారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి పుష్ప పల్లకీలో భక్తులను అనుగ్రహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో శ్రీశైల గిరులు ఇల కైలాసాన్ని తలపించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉదయం చండీశ్వరపూజ మండపారాధన కలశార్చన శివపంచాక్షరీ జపానుష్టానాలు రుద్రపారాయణలు, రుద్రహోమం చండీహోమాలు నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న తెలిపారు.
సాయంత్రం హోమాల అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వేంచేపు చేసి అక్కమహాదేవి మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం వివిధరకాలైన ఎర్రబంతి, పచ్చబంతి, చామమంతి, కనకంబరాలు, అశోక పత్రాల మాలలు, నందివర్ధనం, గరుడ వర్ధనం, కాగడాలు, అస్సెర్ గ్రాస్, గ్లాడియేలస్ పలు రకాల పుష్పాలతో అలంకరించిన పుష్ప పల్లకీలో భ్రామరీ సమేత మల్లికార్జున భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, డప్పుచప్పుళ్లతో గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు, నందిమండపం నుంచి క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రుడి ఆలయం వరకు గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది.
స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, జాంజ్పథక్, వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. పుష్పపల్లకీలో ఆదిదంపతులను దర్శించుకున్న వారి కష్టాలను తొలగి, సుఖ సంతోషాలతో బాసిల్లుతారని ప్రధాన అర్చకులు తెలిపారు. గ్రామోత్సవంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు విజయలక్ష్మి సుబ్బరాయుడు, ఏసీ వెంకటేశ్, ఏఈవోలు హరిదాసు, ఫణిందర్ప్రసాద్, సీఎస్వో అయ్యన్న, పర్యవేక్షకులు రవికుమార్, దేవిక పాల్గొన్నారు.