హిరణ్యకశిపుడు సాక్షరుడైన రాక్షసుడు. విద్య ఉన్నా వివేకం లేనివాడు. వేదాంతం తెలిసినా భేదాంతం కాని వాడు- భేద బుద్ధి నశించనివాడు. ఎంతైనా ద్వైతబుద్ధి- భేదబుద్ధి అనే ‘దితి’ పుత్రుడేకదా! కనుక మాటల్లోనే వేదాంతం. అంటే, వాడిది మెట్టవేదాంతమే కాని తుది ముట్టే పట్టుకలిగిన గట్టి వేదాంతం కాదు. అది కేవలం ‘వాచా జ్ఞానం’. అనుభవం లేని పరోక్ష జ్ఞానం. ఇట్టి వాచా (నోటిమాటల) జ్ఞానాన్ని శాస్త్రం అజ్ఞానమనే అన్నది. ‘వాచా బ్రహ్మంబు పల్కవద్దుర వేమా’ అని యోగివేమన అభియోగం! వివేక, వైరాగ్యాలు లేని వాచా జ్ఞానాన్ని నాటకాల్లో వాడే దూది గదతో పోల్చారు ప్రాజ్ఞులు- తత్తవేత్తలు. అది ప్రదర్శనకు, ప్రవచనానికే గాని యుద్ధానికి, పరమార్థానికి పనికిరాదు.
‘పరోపదేశే పాండిత్యం’- పరులకు నీతిని బోధించడంలో ఈ దైత్యపతి- హిరణ్యకశిపునికి ఉన్న పాండిత్యానికి ఈ ‘సుయజ్ఞ’ ఉపాఖ్యాన ప్రసంగం ఒక ప్రకృష్ట ప్రతీకం- సంకేతం. తన తల్లికి, కోడండ్రకు వైరాగ్యం ఉపదేశించే వీడు తాను మాత్రం మదించి మహావిష్ణువుతో విరోధం పెంచుకున్నాడు. తాము ఆచరించక ఇతరులకు బోధించి, తమను తాము బాధించుకొనే వారే అసురులు- హిరణ్యకశిపులు.
దితికి హిరణ్యకశిపుని హితబోధ- అమ్మా! ఉశీనర దేశానికి సుయజ్ఞుడు రాజు. అతడు శత్రువీరులతో వీరోచితంగా పోరాడుతూ యుద్ధంలో వీరమరణం పొందాడు. అతని నిడుపైన చేతులు తెగి నేలమీద ఎడంగా పడి ఉన్నాయి. శోణితం (నెత్తురు) చేత క్షోణి (భూమి) తలమంతా తడిసిపోయింది. తెగిపడిన తలజుట్టు ముడి విడిపోయింది. దివంగతుడైన ఆ భూపతి శవం చూసి భయాక్రాంతలైన అతని కాంతలు (రాణులు), బిడ్డలు, బంధువులు చుట్టుముట్టి హృదయ విదారకంగా రోదిస్తున్నారు. అవనీపతి (రాజు) అంత్యక్రియలకు అడ్డుపడుతూ, అంగలారుస్తూ అలమటిస్తున్నారు. ఇంతలో ఆదిత్యుడు అస్తమించే వేళ అయింది. ఆ సమయంలో వారి భీకర రోదన విని సమవర్తి, సంయమ చక్రవర్తి అయిన యమధర్మరాజు బాలవేషంలో వచ్చి నొచ్చుకుంటున్న ఆ ప్రేత బంధువులకు ఇలా
నచ్చచెప్పాడు.
ఉ॥ మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము, దేహి పుట్టుచుం
జచ్చుచునుండఁ జూచెదరు, చావక మానెడు వారిభంగి నీ
చచ్చిన వాని కేడ్చెదరు? చావున కొల్లక డాఁగవచ్చునే?
యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్
ఆహా! ఏమి ఈ మోహ మహిమ? ఇదెంత ఊహాతీతం! మీరెంత అజ్ఞానులు! మేను (దేహం) మీద మక్కువను ఇంత ఎక్కువగా పెంచుకొని కాలం తీరినవారి కోసం ఈ తీరున భోరున విలపించడం మిక్కిలి వింతగా ఉంది. ప్రాణులకు చావు పుట్టుకలు అపరిహార్యాలు- తిరుగులేనివి, తొలగించుకోజాలనివి. మీరు ప్రతినిత్యం కనేవి, వినేవే గాని ఎరుక లేనివేమీ కాదు కదా! ఈ మట్టి మీద పుట్టి గిట్టని వాడున్నాడా? సతులారా! మీకు మాత్రం అసలు మృతే (చావే)లేనట్లు మరణించిన వారికోసం ఇలా మతిలేకుండా ఇంతగా అతిగా వెత చెందుతున్నారు. చావుకు చిక్కకుండా ఎంచక్కా నక్కి (దాగి) ఉండేవాడు ఎక్కడైనా ఒక్కడన్నా ఉన్నాడా? ఎట్టి ప్రాణికైనా పుట్టిన చోటికి పోవడం ప్రకృతి సిద్ధమే కదా! జీవులకు పరమాత్మ స్వగృహం, ప్రపంచం పరగృహం!
ఆ॥ ధనము వీధి బడిన దైవ వశంబున
నుండుఁ బోవు మూలనున్న నైన
నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు
రక్షితుండు మందిరమునఁ జచ్చు!
బంధువులారా! నిధి (ధనం) నడివీధిలో జారిపడినా విధి (దైవ యోగం) వక్రించకుండా ఉంటే అది సడి-సవ్వడి లేకుండా పడినచోటే భద్రంగా ఉంటుంది. గీత-రాత చెడిపోతే గృహంలో గుట్టుగా దాచిపెట్టినా రట్టయి మట్టుమాయమై పోతుంది. రక్షణలేని దుర్బలుడైనా పుష్కరాక్షుని- భగవంతుని కృపావీక్షణం ఉంటే వనం- అడవిలో కూడా సులక్షణంగా వర్ధిల్లుతాడు. మాతృగర్భంలో అర్భకుని పోషించే హిరణ్యగర్భుని ఈ సందర్భంలో స్మరించుకోవాలి. వాని దయ లోపిస్తే ఎంత పదిలమైన భద్రత ఉన్న సదనం (గృహం)లో ఉన్నా నిధనం (మరణం) నిశ్చయమవుతుంది.
పై ఆటవెలది పద్యం మూలశ్లోకానికి దీటుగా సాగిన పోతనగారి ముచ్చటైన అనువాదం. పంచభూతాల సమూహమైన ఈ దేహం ఒక గేహం (గృహం) లాంటిది. ఇందు మోహంతో మురిసిపోతూ మసలుతూ ఉండే జీవుడు ప్రారబ్ధం తీరిపోగానే పయనమైపోతాడు. దేహం అనిత్యం, దేహి (ఆత్మ) నిత్యం. అరణి (కట్టె)లో దాగి ఉన్న అగ్నివలె, గాత్రం (దేహం)లో సంచరించే గాలివలె, బిసము (తామరతూడు)లో ఉన్న ఆకసం (శూన్యం, అవకాశం) వలె దేహంలో దేహి వేరుగా- అంటకుండా, విలసిల్లుతుంటాడు.
బ్రాహ్మణ బాలక రూపంలో ఉన్న యముడు బేలలై విలపిస్తున ఆ బాల (స్త్రీ)లకు ఇంకా ఇలా బోధించాడు- ఈ భూపాలకుడు (రాజు) నిద్రిస్తుంటే వెర్రి పట్టినట్లు విలపిస్తారేమిటి? ఇప్పటివరకూ అంటూ, వింటూ, కంటూ, తింటూ, మంటూ ఉన్న ప్రాణం పోయిందని మీరు భావించడం పెద్ద పొరపాటు. ఎందుకని? సుషుప్తి (గాఢనిద్ర)లో ప్రాణం ఉన్నా అది అంటున్నదా? వింటున్నదా?.. అనే, వినే, కనే, తినేవాడు జీవుడు- ఆత్మ. వాడు దేహ, ఇంద్రియ, ప్రాణాలకు విలక్షణం- వేరైనవాడు. ఆత్మ ఈ కాయాన్ని (దేహాన్ని) ధరించి ఉన్నంత వరకే కర్మయోగం. జీవుడు దేహాన్ని వదలగానే ఈ సంబంధాల బంధాలన్నీ తెగిపోతాయి. కాలం మూడితే ఎంతటి గుణం, ధనం, బలం కలిగినవాడైనా నేల కూలక తప్పదు. వాన రాకడ, ప్రాణం పోకడ తెలియదంటారుగా! కావున, కాంతలారా! ఇక క్రందించక వెళ్లిపొండి. ఇలా వందల వత్సరాలు కుందుతూ, కుములుతూ కూర్చున్నా మృతి చెందిన మీ పతిదేవుని మీరు పొందలేరు- ‘మృతిబొందిన వారలు చేరవత్తురే?’
ఇలా ధర్మజ్ఞుడైన కృతాంతు (యము)ని నితాంత (మిక్కిలి) ప్రశాంతి, విజ్ఞాన ప్రదాలైన మృదు వచనాలు విని సుయజ్ఞుని భ్రాంత (మోహిత)లైన కాంతలు, బంధువులు ఎంతగానో వింతకులోనై, అంతలోనే లోకంలో ‘అనిత్యమే నిత్యమనే శాశ్వత సత్యా’న్ని గ్రహించి శోకం మానుకున్నారు. తత్తరపాటు తొలగిపోగా కర్తవ్యం గుర్తించి సుయజ్ఞ మహారాజుకి ఉత్తరక్రియలు నిర్వహించి నిర్వికారంగా నిష్క్రమించారు. అంతకుడు కూడా ఆనందాంతరంగుడై అంతర్థానమయ్యాడు.
(సశేషం)
చావుకు చిక్కకుండా ఎంచక్కా నక్కి (దాగి) ఉండేవాడు ఎక్కడైనా ఒక్కడన్నా ఉన్నాడా? ఎట్టి ప్రాణికైనా పుట్టిన చోటికి పోవడం ప్రకృతి సిద్ధమే కదా! జీవులకు పరమాత్మ స్వగృహం, ప్రపంచం పరగృహం!
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పోతన భాగవతం | దెయ్యాలూ వేదాలు వల్లిస్తాయి!
పోతన భాగవతం | దీని భావమేమి శుక మునీంద్ర
పోతన భాగవతం | ప్రచేతసుల పరమపద ప్రాప్తి