ముస్లింలు రోజుకు ఐదు పూటల నమాజు విధిగా చేయాలి. ఖురాన్లో అల్లాహ్ చెప్పిన మాట ఇది. అయితే అల్లాహ్ సాన్నిహిత్యాన్ని కోరుకునేవారు మాత్రం రోజుకు ఆరు పూటలు నమాజు చేస్తారు. ఉదయం వేళ ఫజర్, మధ్యాహ్నం అసర్, సాయంత్రం అసర్, మగ్రిబ్, రాత్రి ఇషా నమాజులు ప్రతీ ముస్లిం విధిగా చేయాల్సిన నమాజులు. అయితే అర్ధరాత్రి దాటాక, మూడోజామున చేసే నమాజు తహజ్జుద్. దీనిని ముహమ్మద్ ప్రవక్త (స) రోజూ విధిగా నెరవేర్చేవారు. ప్రపంచమంతా నిద్రలో ఉండగా మూడోజామున లేచి ఏకాంతంలో చేసే తహజ్జుద్ నమాజు ఎంతో పుణ్యప్రదమని ప్రవక్త (స) చెప్పారు. ఆ ఘడియలో చేతులెత్తి చేసే విన్నపాలు అల్లాహ్ స్వీకృతి పొందుతాయని చెబుతారాయన. ఈ నమాజును ఆచరించే దాసులంటే అల్లాహ్కు ఎంతో ప్రీతి. మూడో రేయిన అల్లాహ్ చివరి ఆకాశం మీదికి వచ్చి ‘నన్ను అడిగేవారెవరైనా ఉన్నారా? అలాంటి వారి విన్నపాలను నేను స్వీకరిస్తాను’ అని ప్రకటిస్తాడని ప్రవక్త (స) పేర్కొన్నారు.
గాఢనిద్రను త్యజించి నమాజు చేసేవారికి అల్లాహ్ కష్టాలనుంచి గట్టెక్కిస్తాడు. ఆ వేళలో దైవం ముందు నిలబడి చేసే నమాజులో గొప్ప అనుభూతి లభిస్తుంది. మనలో నిబద్ధత అలవడుతుంది. ఆ ఘడియల్లో అల్లాహ్ కారుణ్యం కురుస్తుంది. హృదయం దివ్యకాంతితో ప్రకాశిస్తుంది. ముఖంపై తేజస్సు ఉట్టిపడుతుంది. ప్రశాంతత ఆవరిస్తుంది. పనుల్లో శుభాలు వర్షిస్తాయి. దైవభక్తి పరాయణులు… రాత్రివేళలో చాలా తక్కువ నిదురపోతారని, రాత్రి చివరి ఘడియలలో తమ తప్పులకు పశ్చాత్తాపం చెందుతారని ఖురాన్ పేర్కొంటున్నది.
‘రాత్రిపూట ఆరాధన నిమిత్తం నిద్రలేచే పురుషుణ్ని దేవుడు కరుణించుగాక, అతను లేచి నమాజ్ చేస్తాడు. తన భార్యను కూడా (నమాజ్ కోసం) మేల్కొలుపుతాడు. ఒకవేళ ఆమె లేవకపోతే ముఖం మీద నీళ్లుచల్లి లేపటానికి ప్రయత్నిస్తాడు. అలాగే రాత్రిపూట ఆరాధన నిమిత్తం నిద్రలేచే స్త్రీని దేవుడు కరుణించుగాక, ఆమె లేచి నమాజ్ చేస్తుంది. తన భర్తను కూడా (నమాజ్ కోసం) నిద్రలేపుతుంది. ఒకవేళ అతను లేవకపోతే ముఖం మీద నీళ్లు చల్లి మరీ లేపటానికి ప్రయత్నిస్తుంది’ అని చెప్పారు ప్రవక్త.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076