ధ్యానం అంటే.. శరీరం, మనసుల పరిమితులను దాటి ముందుకు వెళ్లడం. ఎప్పుడైతే శరీరం, మనసులకు పరిమితమైన దృష్టి కోణాన్ని అధిగమిస్తారో అప్పుడే మనలో ఉన్న పరిపూర్ణత్వాన్ని చూడగలుగుతాం. మనిషి తనను తాను ఒక శరీరంగా గుర్తించుకున్నప్పుడు, అతని జీవన దృష్టికోణం మొత్తం మనుగడ మీదే ఉంటుంది. ఒక వ్యక్తి మనసుతో గుర్తింపు ఏర్పర్చుకున్నప్పుడు, అతడి దృష్టికోణం సామాజికమైన, మతపరమైన, కుటుంబపరమైన పరిస్థితులకు బానిస అవుతుంది. అంతకుమించి ముందుకు చూడలేరు. మనసు పొందే మార్పులు, చేర్పుల నుంచి విముక్తి పొందినప్పుడు మాత్రమే అతీతమైన పరిణామం తెలుస్తుంది. ఈ శరీరం, మనసు మనవి కావు. అవి మనం కొంత కాలంగా కూడబెట్టుకున్నవి. శరీరం కేవలం మనం తిన్న ఆహారపు కుప్ప. మనసనేది బాహ్యం నుంచి పోగుచేసుకున్న జ్ఞాపకాల సమాహారం. ఇవి మనుషులు కూడబెట్టుకున్న ఆస్తులే అవుతాయి. దాచుకున్న డబ్బు, కట్టుకున్న ఇల్లు ఎలాగైతే ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తులు అవుతాయో.. శరీరం, మనసు కూడా పోగు చేసుకున్నవే!
ఉన్నతమైన జీవితం గడపడానికి మంచి సంపద, మంచి శరీరం, మంచి మనసు కావాలి. కానీ, అవి మాత్రమే సరిపోవు. కేవలం వీటితోనే మనిషి పరిపూర్ణత పొందలేడు. శరీరం, మనసు మనిషి మనుగడకు సాధనాలు మాత్రమే! అవి జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చగలవంతే! అయితే ఈ శరీరం, మనసుల పరిమితులను దాటినప్పుడే నిజమైన తత్వం తెలుసుకోగలుగుతాం. యోగ, ధ్యానం ఇందుకు శాస్త్రీయ సాధనాలు. తినడం, నిద్రపోవడం, సంపద, దాంపత్యం, కుటుంబం, చివరగా మరణం జీవితంలో సాధారణంగా ఉండేవి. వీటి ద్వారా జీవితంలో పరిపూర్ణత పొందలేరు. ఇవన్నీ జీవితంలో అవసరమే! కానీ, కేవలం వీటిని సాధించినంత మాత్రాన జీవితం పరిపూర్ణం కాదని గుర్తించాలి. ఎందుకంటే, మనిషి తత్వం ఒకస్థాయి ఎరుకని దాటి ముందుకు వెళ్తేనే, అది మరింత ఎక్కువ కావాలి అని తపన పడుతుంది. లేకపోతే ఎప్పటికీ సంతృప్తి చెందదు. మనిషి తత్వం అపరిమితంగా మారాలి. ‘నీవు ఎవరు?’ అనే అపరిమిత కోణంలోకి వెళ్లే మార్గం.. ధ్యానం. శరీరం, మనసులను దాటేందుకు ధ్యానం ఒక శాస్త్రీయ సాధనం.
ఒక ప్రక్రియగా ధ్యానం ప్రత్యేకమైనది. ఇది తరువాత సమగ్రతకు దారితీస్తుం ది. ధ్యానం ప్రారంభించినప్పుడు కళ్లు మూసుకొని కూర్చుంటారు. ఆధ్యాత్మిక ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులు చాలా ప్రత్యేక తత్వం కలిగి ఉంటారు. వారు ఎవరితోనూ కలవలేరు. ‘నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తే, ఈ సమాజం లో కలవలేనేమో?’ అని ఒక భయం మనుషుల్లో ఉంటుంది. ఎందుకంటే ధ్యానం వ్యక్తిగతమైన ప్రక్రియ. ఏదైనా ఆచార వ్యవహారాలు చేయాలనుకుంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తామంతా ఒక్కటే అన్నవిధంగా అందులో పాల్గొనా లి. అందరూ లోతైన ఏకత్వ భావన కలిగి ఉండాలి. ఆచారాలలో మరొక కోణం ఉంది. అవి దుర్వినియోగం కాబోవని నిర్ధారణ అయితే తప్ప, వాటిని ఆచరించే వ్యక్తులు తమ జీవితాలలో ఆచారాలకు ఉన్నత స్థానం ఇస్తే తప్ప.. ఆ ప్రక్రియ చేయలేరు. ఎందుకంటే కొన్ని ఆచారాలు సులభంగా దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయి. అదే ధ్యానానికి వస్తే, అది పూర్తిగా వ్యక్తిగతమైనది. అందుకే ధ్యాన ప్రక్రియలను దుర్వినియోగం చేయలేం.
నీకు నేను పోటీ, నీవు నాకు వ్యతిరేకం అనే భావనలు ఉంటే మనం ఆచార కాండ పాటించలేం. ఆ ఆచారం వికృతమైన ప్రక్రియ అవుతుంది. కలుపుగోలు వాతావరణం ఉన్నప్పుడు, అదే ఆచారకాండ ఒక గొప్ప ప్రక్రియ అవుతుంది. కానీ, నేటి ప్రపంచంలో ఆ కలుపుగోలు తత్వం ఉన్న వాతావరణాన్ని సృష్టిం చడం చాలా కష్టమైన విషయం. ఏవో కొన్ని సంఘాలలో మాత్రమే సాధ్య మైంది. మిగిలిన వారు చాలా ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఇలాంటి సందర్భాలలో, ధ్యానం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ప్రేమాశీస్సులతో..
సద్గురు ఈషా ఫౌండేషన్