Maha Shivaratri | ఉజ్జయిని పురంలో మహాకాలేశ్వరుడు. కాశీలో విశ్వేశ్వరుడు. సౌరాష్ట్రలో సోమనాథుడు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో పేరుకో తీరున వెలిసిన వెండికొండ వెలుగు రేడు.. తెలంగాణలో రాజరాజేశ్వరుడు. జానపద భక్తులకు మల్లన్న. సామాన్య ప్రజలకు లింగమూర్తి. అసాధారణ మొక్కులు అందుకునే సదాశివయ్య. మహా శివరాత్రి పర్వం దగ్గరపడటంతో సర్వ శైవక్షేత్రాలు జనజాతరకు సిద్ధమవుతున్నాయి. కోడెమొక్కుల చెల్లింపులు, కోరమీసాల సమర్పణలు, అగ్నిగుండం దాటడాలు, అడవిదారిలో ప్రయాణాలు.. ప్రతి సన్నివేశం శివాత్మకమే! ప్రతి భక్తుడూ శంకర కింకరుడే!!
అందరూ ఆరాధించే దైవం శివుడు. అందరినీ ఆకట్టుకునేది శివతత్తం. మహన్యాసంతో కొందరు కొలుస్తారు. రుద్రంతో మరికొందరు అభిషేకిస్తారు. ‘శంభో శివ.. సాంబశివ.. హరహర మహాదేవ’ అని ఎలుగెత్తి పిలిచే భక్తుల మొరనూ ఆలకిస్తాడు. అష్టదిక్పాలకుల్లో ఒకడైన కుబేరుడూ ఆయన భృత్యుడే! నిత్య దరిద్రం అనుభవించిన చిరుతొండనంబి కూడా శివయ్య దాసుడే! తెలంగాణలో పల్లెపల్లెనా శివతత్త్వం పల్లవిస్తుంది. ఆ శివయ్య లీలలను జానపద గీతాలుగా అల్లుకొని పాడుకోవడం మన సంస్కృతి. జాతరలతో, జాగారాలతో జంగమ దేవుణ్ని ఆరాధించడం మన సంప్రదాయం.
‘ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం…’ ‘నాలో ఆత్మవు నీవే. నీలో సగమైన పార్వతి నా బుద్ధికి ప్రచోదన శక్తి. నా పంచప్రాణాలు నీ సహచరులు. నా శరీరం నీ గృహం. ఇందులో నివసించు తండ్రీ. నేను అనుభవించే విషయోప భోగాలన్నీ నీ పూజలే. నిద్రే సమాధిస్థితి. లౌకిక సంచారంలో నేను వేసే ప్రతి అడుగూ నీకు ప్రదక్షిణే. నా ప్రతి పలుకూ స్తోత్రపాఠమే. నా ప్రతిచర్యా నీ ఆరాధనమే.’ జగద్గురువు, జ్ఞాననిధి ఆదిశంకరాచార్యుల శివమానస పూజ స్తోత్రంలోని ఒక శ్లోకం అర్థం ఇది. శివపూజకే కాదు, ఏ పూజకైనా ఇదే సూత్రం. ఏ ఆరాధనకైనా ఇదే మంత్రం. మనసును లగ్నం చేయడమే మంత్రం పరమార్థం.
‘ఏ వేదంబు పఠించె లూత? భుజంగం బే శాస్త్రముల్సూచె..’ శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఈ పద్యం భగవత్ కృపకు నిర్మలమైన భక్తి మాత్రమే కొలమానం అని చెబుతుంది. అలాంటి నిత్యసత్యమైన భక్తితో స్వామిని కొలిచి తిన్నడు భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. బోయగా పుట్టిన అతనికి నమకం రాదు. చమకం అంతకన్నా రాదు. తిన్నడు పంచాక్షరి మంత్రాన్నీ తిన్నగా పఠించలేడు. అయితేనేం, బ్రహ్మాది దేవతల వంటి సేవకులను వీడి.. బంటుకు బంటుగా వచ్చి అనుగ్రహించిన కన్నప్ప కథ భక్తులపై భోళా శంకరుడి అవ్యాజమైన కృపను తెలియజేస్తుంది. నమ్మి కొలిస్తే చాలు.. కొమ్ముకాస్తాడు. అందుకే, శివయ్యకు అందరూ భక్తులే! ఆబాలగోపాలమూ అభిషేకిస్తుంటే సరిగంగ స్నానాలు చేస్తున్న అనుభూతికి లోనవుతాడు.
లింగమూర్తిని ఆప్యాయంగా స్పృశిస్తే చాలు.. ఆత్మీయంగా చూసుకుంటాడు. ఆడంబరాలు అస్సలు గిట్టవు. చెంబెడు నీళ్లు కుమ్మరిస్తే చాలు.. బిందెడు సిరులు కురిపిస్తాడు. నిండుమనుసుతో నేరేడు పండు చెల్లించినా.. మళ్లీయేడుకు కొండంత సంపదలు అనుగ్రహిస్తాడు. మారేడు దళం ఒక్కటి చాలు మోక్షాన్ని ఇచ్చేస్తాడు. ఏడాదిలో ఒక్క శివరాత్రి ఉపవాసం ఉంటే.. జన్మజన్మల పాపాలు పటాపంచలు చేస్తాడు. ఒక్కరాత్రి జాగారం చేస్తే.. జన్మను సార్థకం చేస్తాడు.
నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని చెర్వుగట్టులో కొలువుదీరిన దైవం జడల రామలింగేశ్వర స్వామి. ఆరోగ్యప్రదాతగా పేరున్న రామలింగేశ్వరుణ్ని జానపదులు కొంగుబంగారంగా భావిస్తారు. ప్రపంచశాంతి కోసం పరశురాముడు శివలింగాలను ప్రతిష్ఠించిన 108 క్షేత్రాలలో చెర్వుగట్టు చివరిదిగా స్థలపురాణం. కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి భక్తుల కోరికలు తీరుస్తానని పరశురాముడికి పరమేశ్వరుడు చెప్పాడట. చెర్వుగట్టులో ఎత్తయిన మూడు గుండ్ల మధ్య దర్శనమిస్తాడు రామలింగేశ్వరుడు. ఈ గుండ్లను ఎక్కి, స్వామివారి పాదుకలను శిరస్సున ధరించి ప్రదక్షిణలు చేసిన వారికి అనారోగ్య బాధలు తొలగిపోతాయనీ నమ్మకం. శివరాత్రి సందర్భంగా చెర్వుగట్టు క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలివస్తారు. స్వామిని దర్శించుకొని తరిస్తారు. ఇక అమావాస్య నాడు చెర్వుగట్టు క్షేత్రంలో నిద్ర చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. అందుకే, ప్రతి అమావాస్యకు వేలాదిగా భక్తులు ఇక్కడికి వస్తారు. అంతేకాదు 3, 9, 14 రోజులు ఇక్కడ నిద్రచేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో జరిగే గట్టు మల్లన్న జాతర ప్రత్యేకమైనది. మల్లికార్జునుడి కమనీయ కల్యాణానికి, జాతరకు వేదికైన వేలాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. చుట్టూ పచ్చని పొలాలు.. పక్షుల కిలకిలరావాలు.. గోదారమ్మ గలగలల సమీపంలోనే ఎత్తయిన గుట్ట.. దాని చివరన ఉన్న దొనలో శివలింగం దర్శనమిస్తుంది. ముక్కంటి విగ్రహం చెంతనే నీటి చెలిమె ఉంది. అన్ని కాలాల్లోనూ దానిలో నీరుంటుంది. ఆ నీళ్లను భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. రంగురంగుల ముగ్గులతో ఆకర్షణీయంగా పట్నాలేసే పూజారుల కోలాహలంతో సందడిగా ఉంటుంది.
భక్తుల శివనామస్మరణతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంది. సుమారు 200 ఏండ్ల క్రితం వేలాల గ్రామంలో నరహరి పోగుల పుల్లయ్య అనే పశువుల కాపరి ఉండేవాడు. ఆయన ఒకరోజు పశువులను మేపేందుకు గ్రామ సమీపంలోని గుట్టపైకి వెళ్లాడు. అక్కడ దొన (సొరంగం)లోంచి గట్టు మల్లన్న రోజూ బయటికి వచ్చి పుల్లయ్యతో కైలాస పటం ఆడేవాడట. కాలక్రమంలో పుల్లయ్య ఊళ్లోవాళ్లకు కనిపించకుండా పోయాడట. అందరూ ఆందోళన చెందుతుంటే.. మల్లన్న దేవుడు ఊరిపెద్ద కలలోకి వచ్చి ‘పుల్లయ్య నా దగ్గరే ఉన్నాడు. ఇకమీదట ఎవరు పిలిచినా పలుకుతాను’ అని చెప్పాడట. అప్పటినుంచి మల్లన్నను తమ బాగోగులు చూసుకునే దేవుడిగా భక్తులు భావిస్తున్నారు. ఏటా శివరాత్రికి జాతర నిర్వహించి బోనాలు సమర్పిస్తారు.
దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శివరాత్రికి భక్తజన సంద్రంగా మారిపోతుంది. ఇక్కడ ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడురోజులు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. ఈ మూడు రోజుల్లో ఐదులక్షల మందికిపైగా భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. కోడెమొక్కుల రాజన్నను తమ ఇంటిదైవంగా, ఇంట్లో మనిషిగా భావిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలోని అద్దాల మంటపంలో మహాలింగార్చన కార్యక్రమం జరుగుతుంది. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో రాజేశ్వరుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఇక స్వామివారి కల్యాణం అంగరంగా వైభవంగా సాగుతుంది. శివరాత్రి మరుసటి రోజు బద్ది పోచమ్మ ఆలయంలో జాతర జరుగుతుంది. రాజన్నను దర్శించుకున్న భక్తులు బద్ది పోచమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ప్రధాన ఆలయం నుంచి డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా అందరూ బయల్దేరుతారు. ఈ ఘట్టం శివరాత్రి ఉత్సవానికి అదనపు వైభవాన్ని కలిగిస్తుంది.
కోరమీసాల మల్లన్న కొలువుదీరిన కొమురవెల్లిలో మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పండుగ పర్వదినం సందర్భంగా పెద్దపట్నం వేసి స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా 111 పలకల వెడల్పుతో పంచరంగులతో పెద్దపట్నం వేస్తారు. దీనిని వేయడానికి దేవస్థానంతోపాటు ఇక్కడికి వచ్చే భక్తులు సైతం బండారు తెస్తారు. ఈ పట్నంలోనే కల్యాణం జరుగుతుంది. ఒగ్గు పూజారుల సంప్రదాయం ప్రకారం పాటలు పాడుతూ కల్యాణోత్సవం జరిపిస్తారు. దీనికి హజరైన భక్తులు ‘కోరమీసాల దేవుడికి కోటి దండాలు.. కొమురెల్లి మల్లన్నకు శతకోటి దండాలు..’ అని గొంతెత్తి పరవశిస్తారు. రాత్రంతా జాగారం చేస్తూ.. ఆటపాటల్లో మునిగితేలుతారు. మల్లన్న ఉన్నాడన్న ధైర్యంతో అగ్నిగుండాలు తొక్కుతూ భక్తిని చాటుకుంటారు. సంక్రాంతి తర్వాతి ఆదివారం మొదలైన కొమురవెల్లి సందడి మహాశివరాత్రి రాకతో మిన్నంటుతుంది. ఫాల్గుణ మాసం చివరి ఆదివారం వరకు పట్నం ఉత్సవాలు కొనసాగుతాయి.
శతాబ్దాల చరిత్ర ఉన్న శైవ క్షేత్రం ఐనవోలు. సంక్రాంతి పండుగకు మొదలయ్యే మల్లన్న జాతర ఉగాది వరకు సాగుతుంది. భోగి, సంక్రాంతి సందర్భంగా లక్షలాది భక్తులు జాతరకు హాజరవుతారు. తర్వాత కూడా వారాంతాల్లో భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. శివరాత్రి సందర్భంగా జాతర జోరందుకుంటుంది. లక్షలాదిగా భక్తులు ఐనవోలు చేరుకుంటారు. మల్లన్నకు ఘనంగా బోనాలు సమర్పించి, పట్నం ముగ్గులు వేసి మొక్కులు చెల్లించుకుంటారు.
Maha Shivaratri | ఇద్దరు కవుల ముద్దుల శివుడు.. పాలకుర్తి సోమేశ్వరుడి మహాత్మ్యమిదీ..