Maha Shivaratri Special | బచ్చన్నపేట, ఫిబ్రవరి 15 : భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్ధేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 16 నుంచి 19 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నాలుగు రోజులపాటు సిద్ధులగుట్టపై అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలు, శివపార్వతుల కల్యాణం, అగ్ని గుండాల ప్రవేశం మొదలగు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఆలయ సమీపంలోని విశాల మైదానంలో నిర్మించిన కల్యాణమండపంతోపాటు సిద్ధేశ్వరస్వామి కొలువుదీరిన ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో హైదరాబాద్, జనగామ, యాదగిరిగుట్ట, భువనగిరి ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం సిద్ధేశ్వరస్వామి ఆలయానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. అంతేకాకుండా మండల కేంద్రమైన బచ్చన్నపేట నుంచి ఆటోలు నడుస్తాయి. కాగా, ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచ్ గంగం సతీశ్రెడ్డి, ఈవో చిందం వంశీ తెలిపారు. ఈ నెల 18న నిర్వహించే శివపార్వతుల కల్యాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మలతారెడ్డి దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణం తిలకిస్తారని వారు వెల్లడించారు.
శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో మహిమాన్వితమైన పుట్టులింగం ఉంది. ఇది భూమిలో నుంచి పుట్టిందని, అందుకే దీనికి పుట్టులింగం (స్వయంభూలింగం) అని పిలుస్తారు. సుమారు మూడు శతాబ్దాలుగా చింతాకు పరిమాణంలో పెరుగుతున్న పుట్టులింగం ప్రస్తుతం కొబ్బరికాయ పరిమాణంలో ఉందని పూజారి ఓం నమఃశివాయ తెలిపారు. 98ఏళ్ల క్రితం లింగం చుట్టుకొలత 21.50 ఇంచులుగా ఉండగా, ప్రస్తుతం చుట్టుకొలత 27.50 ఇంచులు, పొడవు 11.50 ఇంచులు పెరిగినట్లు చరిత్ర చెబుతుంది. పుట్టులింగం పెరుగుతోందనడానికి నిదర్శనంగా మూడు నాగప్రతిమలున్నాయి. ఇందులో రెండు ఇత్తడివి, ఒకటి వెండిది. చింతాకు పరిమాణంలో పెరుగుతున్న పుట్టులింగానికి ఇవి రాబోవురోజుల్లో ఈ ప్రతిమలు సరిపోవంటున్నారు. కొడవటూరు గుట్ట నుంచి కొన్నె, సిద్దెంకి గుట్టలకు సొరంగ మార్గం ఉంది.
ఆలయం చుట్టూ పచ్చనిచెట్లు, పంటపొలాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంత గొప్ప మందులకైనా న యంకాని వ్యాధులు కూడా ఇక్కడి ప్రశాంత వాతావరణం లో కొద్దిరోజులు గడిపితే పూర్తిగా తగ్గిపోతాయని భక్తుల నమ్మకం. నిర్మలమైన మనసుతో స్వామివారిని స్మరిస్తూ ఇక్కడ నిద్రిస్తే అన్నిబాధలు తొలిగిపోతాయని విశ్వాసం. స్వామివారి సన్నిధిలో ఉన్న బావిలోని నీళ్లు ఎంతో శ్రేష్ఠమైనవని, కామెర్లు వ్యాధి బారిన పడ్డవారు 41రోజులు ఆ నీరు సేవిస్తే తగ్గిపోతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఆలయాన్ని ప్రభుత్వం 1970లో దేవాదాయశాఖ ఆధ్వర్యంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. దాతల సహకారం ప్రత్యేకంగా కల్యాణమండపం పూర్తి చేశారు. అదేవిధంగా ప్రభుత్వ నిధులతో పెళ్లిళ్లు చేసుకునేందుకు మరో మండపం, రాజగోపురం, మెట్లు, గ్రానైట్, షాపింగ్ కాంప్లెక్స్, భైరవస్వామి ఆలయానికి వెళ్లేందుకు దారి తదితర పనులు చేపట్టినట్లు సర్పంచ్ గంగం సతీశ్రెడ్డి వెల్లడించారు. ఈ ఎనిమిదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటికి పైగా నిధులతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సహకారంతో ఆలయ పరిధిలో చేపట్టినట్లు సర్పంచ్ వివరించారు.
ఈ నెల 16న ఉదయం గంగపూజ, రుత్విక సన్మానం, శతరుద్రాభిషేకం, మంత్రపుష్పం, మంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగం ఉంటుంది. 17న మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, మంగళహారతి, మంత్రపుష్పం, రుద్రహోమం, శతరుద్రాభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదవినియోగం ఉంటుంది. 18న మహాశివరాత్రి ప్రాతఃకాలము, మహన్యాసరుద్రాభిషేకము, సామూహిక రుద్రాభిషేకం, దిష్టికుంభం, శ్రీ భధ్రకాళి వీరభద్రేశ్వరస్వామి ఆహ్వానం(బియ్యం సుంకు), రాత్రి 7.01 గంటలకు శివపార్వతుల కల్యాణం, రాత్రి లింగోధ్భవకాల పూజ, అగ్నిగుండ ప్రజ్వలన, భద్రకాళ పూజ ఉంటుంంది. 19న తెల్లవారు జామున 5గంటలకు అష్టదిక్పాల పూజ, బలిహరణ, అగ్నిపూజ, అగ్నిగుండ ప్రవేశం, ఉదయం 8గంటలకు గెల్పు ఆశీర్వాదమువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని సర్పంచ్ సతీశ్రెడ్డి, ఈవో చిందం వంశీ, ఆలయ ప్రధాన పూజారి ఓం నమఃశివాయలు వెల్లడించారు. ఉత్సవాల ఏర్పాట్లు ఆలయ సిబ్బంది చల్లా రాజేందర్రెడ్డి, మధు, భానుప్రకాశ్రెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డిలు దగ్గరుండి చేయిస్తున్నారు.