Maha Shivaratri Special | లోక శుభకరుడు, మంగళ ప్రదుడు, సర్వ శ్రేయస్సులకు ఆధారభూతుడు పరమశివుడు. అలాంటి జ్ఞానకారకుడు కొలువైన పరమ పవిత్ర క్షేత్రం మేళ్లచెర్వులోని శంభులింగేశ్వరస్వామి ఆలయం. ప్రతియేటా మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శివపార్వతుల కల్యాణాన్ని కనుల పండువగా జరిపిస్తారు. మహాద్భుత వేడుకను చూడడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ నెల 18 నుంచి జాతర ప్రారంభం కానుండగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 18న మహాశివరాత్రి రోజు వేకువజామున శివాలయంలో స్వామి వారికి అభిషేకాలతో జాతర మొదలుకానుంది. అదే రోజు సాయంత్రం ప్రభల ఊరేగింపు, రాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 19న తెలుగు రాష్ర్టాల స్థాయి ఎద్దుల పందేలు ప్రారంభమవుతాయి. 20న ఉదయం రథోత్సవం, 21న రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, 22న రాత్రి పవళింపు సేవ, బహుమతి ప్రదానోత్సవంతో జాతర ముగుస్తుంది.
జాతర సందర్భంగా ఇక్కడ రంగు రంగుల విద్యుల్లతలతో ఏర్పాటు చేసిన ప్రభలపై సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆనందిస్తారు. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఎద్దుల పందేలు, కబడ్డీ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ పోటీలకు తెలుగు రాష్ర్టాల నుంచి పశు పోషకులు తమ ఎద్దులతో పోటీల్లో పాల్గొంటారు. విజేతలకు భారీ స్థాయిలో నగదు బహుమతులు అందజేస్తారు.
మహా శివరాత్రి ఉత్సవాలను ఆలయంలో ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ నిర్వాహకులు, అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షల ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేసింది. వాటితో ఆలయం చుట్టూ సీసీ నిర్మాణం, చలువ పందిళ్లు, బారికేడ్లు, షెడ్లు, ప్రహరీ చుట్టూ ఫ్లడ్ లైట్లు, జనరేటర్ ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా జరిపేందుకు వెయ్యి మంది సిబ్బంది, సీసీ కెమెరాలతో పోలీస్ శాఖ సిద్ధమైంది.
13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల పాలనాకాలంలో గ్రామం వెలుపల గుండ్రని లింగాకారపు రాయి కనిపించింది. యాదవులు ఇక్కడే జీవాలను పోషిస్తుండేవారు. ఓ గోవు నిత్యం ఆ లింగానికి తన పాలధారతో అభిషేకం చేసేదట. ఓ రోజు యాదవులకు స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి తాను మహాశివుడిని అని, తనకు ఇక్కడ ఆలయం నిర్మిస్తే దక్షిణ కాశీగా వెలుగొందుతుందని చెప్పాడట. దాంతో అక్కడ నిర్మించిన ఆలయం దినదినప్రవర్థమానమైంది. ఈ శివలింగం ప్రతి 12 ఏండ్లకోసారి అంగుళం చొప్పున పెరుగుతుందని తెలుస్తుంది. శివలింగానికి గల సింధూరాలు(బొట్లు) పెరుగుతుండటం గమనార్హం. లింగం వెనుక భాగాన పార్వతీదేవి రూపం, కుడివైపున మూడు వేళ్లు పట్టేంత(గంగ) రంధ్రం కనిపిస్తుంది. ఇక్కడి శివలింగం నుంచి గంగాజలం ఎంత తోడినా వస్తూనే ఉంటుందని, ఏటా లింగం పరిమాణంలో మార్పు కనిపిస్తుందని ఆలయ అర్చకుడు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ తెలిపారు. ఇంతటి విశిష్ట చరిత్ర ఉన్న స్వయంభువుడిని శివరాత్రి నాడు దర్శించుకుంటే శుభప్రదమని భక్తుల నమ్మకం.