Maha Shivaratri | పాలకుర్తి సోమేశ్వరుడు ఇద్దరు మహాభక్తులను అనుగ్రహించాడు. రెండు కలాలను కటాక్షించాడు. బమ్మెర పోతన ఇక్కడి సోమన్నను ఉపాసించాడు. పాల్కురికి సోమనాథుడైతే.. సాక్షాత్తు ఆ స్వామి వరాలబిడ్డడే. హాలాహల భక్షణం చేసి జగత్తును కాపాడిన దేవుడు.. ఆ మహాకవుల ద్వారా తెలుగు సాహిత్యానికి అమృతత్వాన్ని ఇచ్చాడు.
జనగామ జిల్లాలోని పాలకుర్తి.. ప్రాచీన హరిహర క్షేత్రం. శంకరుడు సోమేశ్వరునిగా, విష్ణువు నరసింహునిగా వెలసి.. తెలుగునేల మీద హరిహర అభేదాన్ని చాటారు. ఇక్కడి శివరాత్రి ఉత్సవం సుప్రసిద్ధం. కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ క్షేత్రానికి ఆధ్యాత్మిక వైభవంతో పాటు సాహిత్య ప్రశస్తి కూడా ఉంది. పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన.. ఇద్దరు మహాకవుల జన్మస్థలాలూ.. పాలకుర్తి దివ్యక్షేత్ర పరిసరాల్లోనే ఉన్నాయి. సోమనాథుని స్వగ్రామం సాక్షాత్తు పాలకుర్తి గ్రామమే. పోతన జన్మస్థలం మాత్రం ఇక్కడికి రెండు మైళ్ల దూరంలో ఉన్న బమ్మెర. ఇద్దరూ పాలకుర్తి సోమేశ్వర కృపాకటాక్ష పాత్రులే. ‘వ్రాలును వ్రాలు శివార్చనా పరవశ వ్యాప్తిన్ బ్రమోదంబునన్…’ అంటూ పరమేశ్వరతత్వాన్ని పరవశంతో వ్యాప్తి చేయడంలోనే పరమానందాన్ని పొందిన పాల్కురికి సోమనాథుడు ‘సోమేశ్వర వరప్రసాది’ అని చెబుతారు.
స్వామి కరుణవల్ల జన్మించినందుకే సోమనాథుడని పేరుపెట్టుకున్నారు తల్లిదండ్రులు. పోతన కూడా పాలకుర్తి సోమేశ్వరుడిని ఉపాసించాడనడానికి ఆధారాలు ఉన్నాయి. ప్రముఖ పండితులు జయంతి రామయ్య పంతులు పోతన జన్మస్థల వివాద పరిష్కారానికి ఓరుగల్లుకు వచ్చినపుడు, స్థానికంగా కొంత సమాచారం సేకరించారు. వాటిని ‘ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక నాలుగో సంపుటం’లో ప్రచురించారు. శతాబ్దాల క్రితం పాలకుర్తి భక్తులు పాడుకున్న పాటనూ అందులో ప్రస్తావించారు.. ‘పాలకుర్తి నిలయా! సోమయలింగా! పాదములకు శరణు వురువుగ బొమ్మెర పోతరాజుకు మీరు కోరినవరములు కృపజేశినారట, పాలకుర్తి నిలయా..’ అని సాగుతుందా గీతం. హరికథను అందించిన భాగవతోత్తముడిని, హరుడి విలాసాన్ని అక్షరీకరించిన భక్తకవిని కన్న నేలగా పాలకుర్తి కీర్తి అజరామరం. సోమేశ్వరుని వైభవం ఆచంద్రతారకం.
– రెడ్డి రత్నాకర్ రెడ్డి, కె.వి.టి.కె.ఎన్. ప్రశాంత్