Maha Shivaratri 2022 Special | శివపూజకు కావాల్సింది.. కలశంలో నీళ్లు.. దోసెడు విభూది.. చిటికెడు కుంకుమ.. ఒక మారేడు దళం.. వీటిలో లోటుపాట్లున్నా.. నాలోనే శివుడు ఉన్నాడన్న భావన ప్రధానంగా ఉండాలి. మదిలో రుద్రుడిని నిలిపి, మహిమగల రుద్రుడిని అభిషేకించాలి. శివుడిగా, పరమేశ్వరుడిగా, మహాదేవుడిగా, శంకరుడిగా.. అనంత నామాలతో పిలుచుకొని, ఆరాధనలు అందుకునే రుద్రుడు ఎవరు? ఒకే దేవుడికి ఇన్ని పేర్లు ఎందుకు? భక్తులకు కలిగే సందేహాలివి. ప్రతి సందేహం వెనుక సందేశాత్మక వివరణలు ఇచ్చాయి మన పురాణాలు. యజుర్వేదంలోనూ ఈ ప్రశ్నలకు సంబంధించి అనేక వివరణలు ఉన్నాయి.
రుద్ర శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. ‘రుతం సంసార దుఃఖం ద్రావయతీతి రుద్రః’- సంసార దుఃఖాన్ని నాశనం చేసేవాడు రుద్రుడు. ‘రుత్యా వేద రూపాయ ధర్మాదీనవలోకయతి ప్రాపయతీతి వా రుద్రః’- వేదరూపంలో ధర్మాన్ని మనకు అందజేసేవాడు రుద్రుడు. ‘రుత్యా ప్రణవ రూపాయా స్వాత్మానం ప్రాపయతీతి రుద్రః’- తనను తాను ప్రణవ నాద రూపంలో ఆవిష్కరింపజేసుకునేవాడు రుద్రుడు. ఇలా అనేక రకాలుగా మన ప్రాచీనులు రుద్ర శబ్దానికి అర్థాన్ని వివరించారు. బృహదారణ్యక ఉపనిషత్తులో ‘రుద్ర’ శబ్దానికి నిర్వచనంతోపాటు, ఎందరు రుద్రులు ఉన్నారు అనే వివరాలు ఉన్నాయి.
మనిషిలో ఉండే ప్రాణాలు, మనసు, జీవాత్మ.. ఇవన్నీ కలిపి ఒకటి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు కలిపితే పది. మొత్తంగా పదకొండు మంది రుద్రులు. వారి పేర్లు రుద్రుడు, త్రయంబకుడు, మహేశ్వరుడు, అహిర్బుధ్న్యుడు, హరుడు, ఏకపాదుడు, అజుడు, పినాకి (త్రిభువనుడు అని కొన్నిచోట్ల పేర్కొన్నారు), శంభుడు, అపరాజితుడు, ఈశానుడు. వీరందరూ రుద్రులే! ఏకాదశ రుద్రులను రుద్రాభిషేకంతో అర్చిస్తారు. రుద్రాభిషేకంలో ముందుగా భౌతిక పూజ, తర్వాత మానసిక పూజ. అటుపై సర్వమూ శివమయం అని గుర్తించి శివ స్వరూపులం కావాలి. ‘నారుద్రో రుద్రమర్చయేత్’ అన్నారు. అంటే ‘రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకానికి అర్హుడు కాదు’ అని ప్రమాణ వచనం. రుద్రుడు నేనే అన్న భావన పరిపూర్ణంగా కలిగి శివార్చన చేయాలి. రుద్రాభిషేకం చేయడానికి అధికారి కావడానికి, రుద్రుడిని తన ఆత్మలో నిలపడానికి రౌద్రీకరణం చేసుకోవాలి. అందుకు మహన్యాసం తోడ్పడుతుంది. రుద్రుడిని తనలో ఆవాహన చేసుకొని, తానే రుద్రుడు అయి, రుద్రార్చనకు అధికారి అవుతాడు కర్త. కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహిత చతుర్థకాండంలోని పంచమ, సప్తమ ప్రపాఠకాలను ‘నమకం, చమకం’ అంటారు. రెండూ కలిపితే రుద్రం. నమక-చమకాలు స్వరబద్ధంగా చదువుతూ అభిషేకం నిర్వహిస్తారు. నమకంలో విశ్వంలోని ప్రతి అణువూ రుద్రుడే అని భావన చేస్తూ, ఆయా రూపాల్లో వ్యక్తమయ్యే రుద్రుడికి నమస్కారం చెయ్యటం ప్రధానాంశంగా ఉంటుంది. చమకంలో ఇందుకు భిన్నంగా భక్తుడు తన కోరికల చిట్టాను భగవంతుడి ముందు సమర్పిస్తాడు. ‘శివా! వీటన్నిటినీ నాకు అనుగ్రహించవలసింది’ అని ప్రార్థిస్తాడు. సద్యోజాత,వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన పేర్లతో పంచముఖాలతో నాలుగు దిక్కులను, ఊర్ధదిశను చూస్తూ జగత్తును రక్షిస్తున్న రుద్రుడికి, పరమాత్మకు ఆత్మార్పణం చేస్తున్నానన్న భావనతో రుద్రాధ్యాయాన్ని పారాయణం చేస్తారు.
శివారాధనలో ప్రముఖమైన రుద్రాభిషేకాన్ని వివిధ రకాలుగా ఆచరిస్తారు. ఏకాదశ రుద్రాభిషేకం, లఘురుద్రం, శతరుద్రీయం ఇలా శక్తిసామర్థ్యాలను బట్టి భక్తులు దీనిని నిర్వహిస్తూ ఉంటారు. నమక-చమకాల సంఖ్య ఆధారంగా వీటిని వివిధ రకాల రుద్రాభిషేకాలుగా పిలుస్తారు. శ్రీకృష్ణుడు ఒక ఏడాదిపాటు పాశుపత దీక్ష చేసి, విభూదిని వంటినిండా అలుముకొని, రుద్రాధ్యాయాన్ని పారాయణ చేశాడని కూర్మ పురాణం చెబుతున్నది. జాబాల ఉపనిషత్తులో బ్రహ్మచారులు ‘కిం జప్యేన అమృతత్వమశ్నుతే?’ (దేనిని జపించడం వల్ల అమృతత్వం కలుగుతుంది) అని ప్రశ్నిస్తారు. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి ‘శత రుద్రీయం’ చేయడంతో అమృతత్వం సిద్ధిస్తుందని సమాధానం చెబుతాడు. నిత్యం రుద్రాధ్యాయాన్ని జపించేవాళ్లు ముక్తిని పొందుతారని స్మృతులు చెబుతున్నాయి. ఐహిక భోగాలు, మోక్షం, పాప ప్రాయశ్చిత్తం కోరుకునేవారికి రుద్రుడి ఆరాధనకు మించిన మార్గం లేదు.
ఈశ్వరుడు అష్టవిధ మూర్తి. కాళిదాస మహాకవి ఈశ్వరుడి అష్టమూర్తి తత్త్వాన్ని ఇలా స్తోత్రం చేశాడు.
యా సృష్టిః స్రష్టురాద్యా వహతి విధిహుతాం
యా హవిర్యా చ హోత్రీ
యే ద్వే కాలం విధత్తః శ్రుతి విషయగుణా
యా స్థితా వ్యాప్య విశ్వమ్
యామాహుః సర్వభూత ప్రకృతిరితి
యయా ప్రాణినః ప్రాణవన్తః
ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః॥
‘నేల, అగ్ని, నీరు, గాలి, ఆకాశం అనే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, ‘నేను’ అనే యజమాని- ఈ ఎనిమిది రూపాలలో ఈశ్వరుడు విరాజిల్లుతున్నాడు. విశ్వరూపుడు, మహత్తర శక్తి కలిగిన పరమాత్మ అయిన రుద్రుడిని ఏకాదశ రుద్రాభిషేకాలతో ప్రసన్నుడిని చేయడం వల్ల ప్రకృతి ప్రశాంతత పొందుతుంది’ అని వివరించాడు కాళిదాస కవి.
‘అభిషేక ప్రియః ఈశ్వరః’- ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. శివుడు విశ్వరూపుడు కనుక, రుద్రాభిషేకంతో విశ్వం చల్లబడుతుంది. ఈ లోకం సుఖశాంతులతో చల్లగా ఉంటుంది. పంచామృతాలతో, గంగాజలంతో రుద్రుణ్ని అభిషేకించి, తుమ్మిపూలతో, మారేడు దళాలతో పూజించి, గోక్షీరాన్ని, కదళీ (అరటి) ఫలాన్ని నైవేద్యం పెట్టాలి. చతుఃషష్టి (64) ఉపచారాలతో అర్చించాలి. కుదరక పోతే షోడశోపచారాలతో అయినా పూజించాలి. మనకు పంచేంద్రియాలను అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా కనీసం పంచోపచారాలతోనైనా పూజించాలి. ఏ మంత్రాలూ రాకున్నా.. మనసు నిండా భక్తి భావంతో శివపంచాక్షరి జపం చేసినా శివయ్య అనుగ్రహం తప్పక లభిస్తుంది.
…?శ్రీ భారతి
Maha shivaratri 2022 | కాశీకి వెళ్తే 9 రాత్రులు నిద్ర చేయాలని అంటారు.. ఎందుకు
Maha Shivaratri 2022 | వేములవాడ రాజన్నకు కోడె మొక్కులు ఎందుకు చెల్లిస్తారు?
ఇంట్లో రెండు శివలింగాలు ఉంటే ఏమవుతుంది?
పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి పెడతారు ఎందుకు?