27 హిమగిరి సొగసులు కాదని, కాశీ ( Kashi ) నగరానికి కోరి వచ్చాడు కైలాసనాథుడు. ఆ విశ్వనాథుడి వెంటే.. విశాలాక్షి. ఆమెకు తోడుగా అన్నపూర్ణ. వారికి నీడగా డుండి గణపతి. వీళ్లందరి వెంట కాలభైరవుడు. ఒకరి తర్వాత ఒకరు.. ఒకరి కన్నా వేగంగా ఇంకొకరు.. మొత్తంగా ముక్కోటి దేవతలు వారణాసిని మరో మజిలీగా మార్చుకున్నారు. గంగ ఒడ్డున ఆలయాలు.. వీధి మలుపులలో గుళ్లూ గోపురాలు.. ఇండ్ల మధ్య ఇలవేల్పులు.. గుడిగంటలకు విరామం ఉండదు. ఏదో ఒక ఆలయం నుంచి ప్రణవనాదం వినిపిస్తూనే ఉంటుంది. కాశీవాసులకు అందులో వింతేమీ తోచకపోవచ్చు. కానీ, అక్కడికి వెళ్లిన యాత్రికులకు మాత్రం కాశీలో అడుగడుగునా ఓ అద్భుతం దర్శనమిస్తుంది. పీల్చే గాలిలో, తాగే నీటిలో, తినే ఆహారంలో అన్నిటా శివతత్తం గోచరం అవుతుంది. సాధువులు, సత్సంగాలు, బారులుతీరిన భక్తులు, గంగలో మునకల అపురూప దృశ్యకావ్యం విరామం లేకుండా దర్శనమవుతూ ఉంటుంది. మహాశివరాత్రి ( Maha shivaratri )సందర్భంగా మహిమాన్విత క్షేత్రం వారణాసి ( Varanasi ) విశేషాలు…
భక్తయోగ పదన్యాసి వారణాసి
భవదురిత శాత్రవఖరాసి వారణాసి
స్వర్ణదీ తటసంభాసి వారణాసి
పావనక్షేత్రముల వాసి వారణాసి
‘భక్తులు, యోగులు మొదలైన వారి పాదాలకు కొలువైన క్షేత్రం, భవబంధాలను చీల్చి చెండాడి, వాటినుంచి విముక్తి కలిగించే క్షేత్రం, పరమ పవిత్రమైన గంగానది ఉన్న క్షేత్రం, ఎన్నెన్నో దైవికమైన క్షేత్రాలకు నిలయం వారణాసి’ అని కాశీ వైభవాన్ని చాటి చెబుతాడు సత్య హరిశ్చంద్రుడు. ఈ వాక్యాల్లోని ప్రతీ అక్షరం హరిశ్చంద్రుడి మాటంత సత్యమైంది.
అతి పురాతనమైనదిగా చెప్పే రుగ్వేదంలోనూ కాశీ ప్రస్తావన కనిపిస్తుంది. వేద కాలం నుంచే వారణాసి కీర్తి దశదిశలా వ్యాపించింది. ‘కాశి’ అంటే ‘నిరంతరం వెలుగొందునది’ అన్న అర్థం ఉంది. పేరుకు తగ్గట్టుగానే ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతీది నిత్యనూతనంగా ప్రకాశిస్తుంది. మోక్షపురిగా, కళలకు కాణాచిగా, పట్టుచీరలకు పట్టుకొమ్మగా, సంప్రదాయాలకు చిరునామాగా అలరారుతున్నది. వరుణ, అసి రెండు నదులు కలిసిన భూభాగం కావడంతో ‘వారణాసి’ అన్న పేరు వచ్చింది. ఆలయ నగరిగా ప్రసిద్ధిచెందిన కాశీలో చిన్నా పెద్దా ఆలయాలు వేలల్లో ఉంటాయి. ప్రతి ఆలయం వెనుక ఓ పౌరాణిక గాథ వినిపిస్తుంది. గుడి ఆకారం చూసి దాని ప్రాముఖ్యాన్ని అంచనావేయడం కష్టమే. ప్రతి గుడీ విశేష ప్రాశస్త్యం కలిగి ఉన్నదే. ప్రతి దేవుడూ స్వయంగా వచ్చి కొలువుదీరినదే!
‘అయోధ్య, మధుర, మాయా (హరిద్వార్), కాశీ, కాంచి (కంచి), అవంతిక, పూరి, ద్వారవతి (ద్వారక).. సప్తయితే మోక్షదాయకః’ అని వేద వచనం. మోక్షాన్ని ప్రసాదించే ఏడు క్షేత్రాల్లో కాశీ ఒకటి. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. చావును కోరుకుంటూ వారణాసికి వచ్చేవాళ్లు వేలల్లో ఉంటారు. శేష జీవితాన్ని కాశీనాథుని సన్నిధిలో సాధనకు అంకితం చేసి తరించేవాళ్లు అనేకులు. అవసాన దశలో పట్టుదలతో కాశీకి వచ్చి కన్నుమూసిన వ్యక్తుల కథలూ వినిపిస్తాయి. అంతేకాదు, కాశీలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే మోక్షం లభిస్తుందని, ‘ఎక్కడ పోయినా, కాశీలోనే తమ కట్టె కాలాలి’ అని చివరి కోరికగా విన్నవించుకునే వాళ్లూ ఉంటారు. చివరికి పోయినవారి అస్థికలు కాశీలో గంగలో కలిపినా ముక్తి లభిస్తుందని చెబుతారు. అందుకే నిత్యం వందలాది మంది తమ ఆత్మీయుల అస్థికలు తెచ్చి గంగలో నిమజ్జనం చేస్తుంటారు.
తనకు తానుగా కోరుకొని, దేవతల కోరిక మేరకు కైలాసం నుంచి కదిలివచ్చిన శివుడు కాశీలో విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడని ప్రతీతి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇదీ ఒకటి. యుగాలుగా కొలువుదీరిన ఈ క్షేత్రం, ఎందరో రాజులకు రాజధాని నగరంగా విలసిల్లింది. ముమ్మరంగా సాగిన వర్తక వాణిజ్యాలతో సంపన్న నగరంగా ఎదిగింది. మధ్యయుగంలో జరిగిన దండయాత్రలతో విశ్వనాథుడి కోవెల అనేకసార్లు విధ్వంసానికి గురైంది. రాజపుత్రులు, మరాఠా పాలకులు ఎన్నో ఆలయాలను తిరిగి నిర్మించారు. ఇప్పుడున్న విశ్వనాథుడి ఆలయాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. ఈ విధ్వంసాలు చరిత్రపుటల్లో ఎలా మిగిలిపోయినా, కాశీ పవిత్రత మాత్రం చెక్కుచెదరలేదు.
జ్యోతిర్లింగ క్షేత్రంగా మాత్రమే కాదు శక్తిపీఠంగానూ వారణాసి ప్రసిద్ధిచెందింది. (ఇలాంటి మరో క్షేత్రం శ్రీశైలం.) మీర్ ఘాట్ సమీపంలో ఉన్న దేవాలయంలో అమ్మవారు విశాలాక్షిగా కొలువుదీరింది. సతీదేవి చెవికమ్మలు లేదా కన్నులు ఈ ప్రదేశంలో పడ్డాయని స్థలపురాణం. అన్నపూర్ణాదేవి ఆలయం కూడా అపర శక్తిపీఠంగా దర్శనమిస్తుంది.
జన్మాంతర యోగం ఉంటే గానీ, కాశీలో అడుగుపెట్టలేం అని చెబుతారు పెద్దలు. ఇలా అనుకోగానే అలా వారణాసికి అందరూ వెళ్లలేరు. కాశీలో అడుగుపెట్టాలంటే ముందుగా కాలభైరవుడి అనుగ్రహం ఉండాలి. ఎంత దూరంనుంచి కాశీపురికి వచ్చినా.. కాలభైరవుడి ఆజ్ఞ తీసుకున్న తర్వాతే మిగతా ఆలయాల దర్శనానికి వెళ్తుంటారు. కాశీ నగరం భద్రత వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటాడని నమ్మకం. అందుకు తగ్గట్టే కాశీ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది భైరవ ఆలయాలు ఉంటాయి. అన్ని ఆలయాలనూ దర్శించుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని అంటారు. భక్తులే కాదు, వారణాసికి వచ్చే కొత్త కొత్వాల్ (పోలీస్ కమిషనర్) సైతం ముందుగా భైరవుడి ఆలయాన్ని సందర్శించుకుంటాడు. ‘నీ ప్రతినిధిగా కాశీ రక్షణ బాధ్యతలు నిర్వర్తించే అధికారం నాకు ప్రసాదించు స్వామి’ అని అభ్యర్థించిన తర్వాతే విధుల్లో చేరుతాడు.
దివిజ గంగకు భువిలో అత్యంత ప్రాధాన్యం కాశీలో కనిపిస్తుంది. ‘కాశీ గంగ’ను తలుచుకున్నంత మాత్రాన పాపాలు పరిహారం అవుతాయని అంటారు. హిమాలయాల్లో పుట్టింది మొదలు దక్షిణముఖంగా ప్రవహించే గంగా నది.. కాశీలో ఉత్తరంగా ప్రవహించడమే ఇంతటి ప్రాధాన్యానికి కారణం. ఉత్తరవాహినిగా ప్రవహించే గంగలో మునకేయడం జన్మజన్మల అదృష్టంగా భావిస్తారు. భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారతీయ నాగరికతలో అతిముఖ్య భాగమైన గంగ ఒడ్డున కాశీ వైభవం అంతా కనిపిస్తుంది. పుణ్యస్నానాలు ఆచరించే వారు ఒకవైపు, పితృదేవతలకు తిల తర్పణాలు విడిచేవారు మరోవైపు, ఓ ఘాట్లో కర్మకాండలు, మరో ఘాట్లో అభిషేకాలు, ఒకచోట హోమాలు, మరోచోట దహనక్రియలు.. సనాతన సంప్రదాయంలోని సంస్కారాలన్నిటినీ ఇక్కడ చూడొచ్చు. ఒకసారి రుద్రభూమిగా, మరోసారి అమరధామంగా దర్శనమిస్తుంది గంగా తటి. కాశీలో గంగ పొడవునా 84 ఘాట్లు ఉన్నాయి. దశాశ్వమేధ ఘాట్, తులసీ ఘాట్, కేదార్ ఘాట్, లలితా ఘాట్, అస్సీ ఘాట్.. ఇలా ఎన్నో. వేటికదే ప్రత్యేకం. ప్రతి ఘాట్దీ ఓ ప్రత్యేక పౌరాణిక, చారిత్రక నేపథ్యం. హరిశ్చంద్ర, మణికర్ణిక ఘాట్లలో నిరంతరం దహనక్రియలు జరుగుతూనే ఉంటాయి. దశాశ్వమేధ ఘాట్, దర్భంగా ఘాట్, హనుమాన్ ఘాట్, మాన్మందిర్ ఘాట్లు ప్రత్యేకమైనవిగా చెబుతారు. మానసరోవర్ ఘాట్, నారద ఘాట్, మణికర్ణిక ఘాట్లు పితృదేవతలకు పిండప్రదానాలు, అస్థికల నిమజ్జనానికి ప్రత్యేకం. కాశీలో రెండు వారాలు విడిది చేసినా.. ఈ ఘాట్లన్నీ దర్శించుకోలేం. చాలామంది పడవలపై గంగానదిలో విహరిస్తూ ఘాట్లన్నీ దర్శించుకుంటారు. తొలి, మలి సంధ్యల్లో గంగానదిపై విహారం అద్భుతమైన అనుభూతిని మిగుల్చుతుంది.
కాశీపురి పైకి ఎంత హడావుడిగా కనిపిస్తుందో, మనసుతో చూస్తే అంత నిగూఢంగా ఉంటుంది. ఏదో ఆధ్యాత్మిక శక్తి అంతరంగా దాగి ఉందనిపిస్తుంది. అభిషేకాలు, సత్సంగాలు, భజనలు ఇదంతా ఒక పార్శమే! సాధకులు, అఘోరాలు, సాధనలు ఇవి సామాన్యుల కంటికి కనిపించవు. పైపైన చూస్తే.. ఏమీ అంతుపట్టదు. లోలోపల దర్శిస్తే అణువణువూ శివుడే కనిపిస్తాడు. ఈ మహిమను దర్శించడానికి అణిమాది అష్టసిద్ధులు సాధించిన యోగులెందరో కాశీలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సిద్ధులను పొందడానికి దేశదేశాల నుంచి సాధకులు వారణాసికి వచ్చి ఇక్కడే ఉండిపోతారు. తులసీదాసు, కీనారాం అఘోరీ, త్రైలింగ స్వామి.. ఇలాంటి మహామహులు ఎందరో విశ్వనాథుడి సన్నిధిలో సంచరించినవారే. నేటికీ ఎందరో సిద్ధులు కాశీలో తపస్సు ఆచరిస్తుంటారు. కొందరు బైరాగుల్లా కనిపిస్తారు. మరికొందరు మాటాపలుకూ లేకుండా మౌనదీక్షలో తరిస్తుంటారు. కాశీ పరిసరాల్లో అఘోరాలు కోకొల్లలు. కానీ, సామాన్యంగా వారు ఎవరి కంటాపడరు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బయటికి వస్తుంటారు. అంతేకాదు, కొన్ని మార్మిక, తాంత్రిక విద్యలకు కాశీ కేంద్ర బిందువు. హిందువులకు మాత్రమే కాదు, ఇతర మతాలకూ కాశీ ప్రాధాన్య క్షేత్రమే! నగర శివారులో ఉన్న సారనాథ్ బౌద్ధుల పుణ్యస్థలి. గౌతమ బుద్ధుడు మొదటిసారి ధర్మోపదేశం చేసింది సారనాథ్లోనే. జైన ఆలయాలు కూడా కాశీలో కనిపిస్తాయి. ముస్లింలు ఇక్కడి జ్ఞాన్వాపి మసీదును పవిత్రమైనదిగా భావిస్తారు.
వారణాసి అంటే ఇరుకు వీధులు, ఇసుకేస్తే రాలనంత జనాలు. కాలక్రమంలో చోటు చేసుకుంటున్న మార్పులు, కొత్త నిర్మాణాలు ఈ క్షేత్రానికి కొత్త సొబగులు అద్దుతున్నాయి. ఎంత మారినా, కొత్తగా ఎన్ని హంగులు వచ్చిచేరినా కాశీపురికి చిరునామా అచంచలమైన భక్తి మాత్రమే! లక్షల్లో తరలి వచ్చే భక్తులు, గంగ ఒడిలో వేసే మునకలు, తర్పణాలు, దాన ధర్మాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఇవే కాశీని అపర కైలాస సదనంగా నిలబెడుతున్నాయి. కార్తిక మాసం, మహాశివరాత్రి వంటి ప్రత్యేక సమయాల్లో కాశీ వైభవం చూసి తరించాల్సిందే. శివరాత్రి సందర్భంగా మృత్యుంజయ ఆలయం నుంచి విశ్వనాథుడి సన్నిధి వరకు కోలాహలంగా ఊరేగింపు నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొని ‘జై బోలేనాథ్’ అంటూ జేజేలు పలుకుతారు. కార్తిక పౌర్ణమి సందర్భంగ గంగ ఒడ్డున అన్ని ఘాట్లలోనూ లక్షల్లో దీపాలు వెలిగిస్తారు. గంగ ఒడ్డున దీపాలు, గంగా తరంగాలపై ఆ దీపాల ప్రతిబింబాలు చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటాయి. కాలం మారినా, కొత్త వసతులు ఎన్ని చేర్చినా.. కాశీ పవిత్రతలో ఏ మార్పూ కనిపించదు.
భగవంతుడు విశ్వవ్యాప్తంగా ఉంటాడు. కానీ, అంతటా నిండి ఉన్న దేవుడి తత్తాన్ని తెలియజేసే పుణ్యక్షేత్రాలు మాత్రం కొన్నే. అందులో ప్రముఖమైనది వారణాసి. కైలాస సదనంలో కులాసాగా ఉంటున్న శంకరుడికి.. ఒకసారి హిమగిరులు దాటి ఆవల ఉండాలని మనసు పుట్టింది. పార్వతితో కలిసి ఏదైనా సిద్ధక్షేత్రంలో నివసించాలని కోరుకున్నాడు. చివరికి కాశీని ఎంచుకున్నాడు శివుడు. అప్పటికే కాశీని రాజధానిగా చేసుకొని ఆ ప్రాంతాన్ని దివోదాసు అనే రాజు పరిపాలిస్తున్నాడు. పరమేశ్వరుడి ఆనతితో నికుంభుడనే రాక్షసుడు వారణాసికి వెళ్లి అక్కడి ప్రజలను, రాజును తరలించి, శివుడు నివసించడానికి అనువైన ఏర్పాట్లు చేస్తాడు. తన రాజ్యం పోయిందన్న బాధతో దివోదాసు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు కాశీరాజు ‘దేవతలు దేవలోకంలో, నాగులు పాతాళంలో, భూలోకంలో మనుషులు మాత్రమే ఉండే విధంగా వరం ఇవ్వమ’ని కోరుతాడు. ‘తథాస్తు’ అంటాడు బ్రహ్మ. దీంతో కాశీనాథుడు మళ్లీ కైలాసానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లినా శివుడి మనసు మనసులో ఉండదు. కాశీలో ఉండటానికి మార్గం సుగమం చేయమంటూ 64 మంది యోగినులను పంపిస్తాడు. ఆ వచ్చిన దేవతలను గంగాతీరంలో ప్రతిష్ఠిస్తాడు దివోదాసు. శివాజ్ఞ మేరకు సూర్యుడు రాగా, ద్వాదశాదిత్య రూపాలుగా గంగ ఒడ్డున ప్రతిష్ఠిస్తాడు. దివోదాసును ఒప్పించడానికి స్వయంగా బ్రహ్మదేవుడే వారణాసికి వెళ్తాడు. ఆయననూ మచ్చిక చేసుకున్న రాజు.. బ్రహ్మతో గంగాతీరంలో దశాశ్వమేథ హోమం చేయిస్తాడు. చివరికి విష్ణుమూర్తి కాశీకి వెళ్లి, దివోదాసుకు జ్ఞానోపదేశం చేస్తాడు. అలా శివుడు మళ్లీ కాశీ విశ్వనాథుడు అయ్యాడని స్థలపురాణం.
కాశీ వెళ్లిన యాత్రికులు అక్కడ తొమ్మిది రాత్రులు నిద్ర చేయాలనే సంప్రదాయం ఉంది. అలా తొమ్మిది రాత్రులు బస చేసినవారికి ముక్తి లభిస్తుందని నమ్మకం. ఆ మాట అలా ఉంచితే, కాశీని కండ్లారా చూడటానికి, మనసారా అనుభవించడానికి మూడు వారాలున్నా సయమం సరిపోదు. పదుల సంఖ్యలో ఘాట్లు, వందల సంఖ్యలో వీధులు, వేలాది ఆలయాలు ఇవన్నీ చూడాలంటే కనీసం రెండుమూడు నెలలైనా పడుతుంది. అందుకే చాలామంది జీవిత చరమాంకంలో కాశీకి వెళ్లి అక్కడ వానప్రస్థాశ్రమం హాయిగా గడుపుతారు. యాత్రగా కాశీ వెళ్లే భక్తులు తప్పకుండా దర్శించుకునే ఆలయాలు కొన్ని ఉన్నాయి. కాలభైరవ మందిర్, బిందుమాధవుడి సన్నిధి, సంకటమోచన హనుమాన్ ఆలయం, రోజుకు నువ్వు గింజ ప్రమాణంలో పెరిగే తిలభాండేశ్వర సజీవ లింగం, కేదార్ ఘాట్లోని కేదారేశ్వర ఆలయం, అపమృత్యుదోషాలను తొలగించే మృత్యుంజయ మందిరం, తులసీదాసు రామాయణాన్ని రచించిన తులసీ మానస మందిరం, నీలకంఠేశ్వరుడి గుడి, ఓంకారేశ్వర ఆలయం, డుండి గణపతి దేవాలయం, అన్నపూర్ణ కోవెల, వారాహి మందిరం, కాళీ దేవాలయం వంటివి తప్పక చూడాల్సినవి. గంగా నది అవతలి వైపున్న రామ్నగర్ కోట అద్భుతంగా ఉంటుంది. పడవలో ఆ ఒడ్డుకు చేరుకొని, కోటంతా కలియ తిరగొచ్చు. ఇప్పటికీ ఆ కోటలో కాశీ రాజుల వారసుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. జంతర్ మంతర్, పోర్ట్ మ్యూజియం యాత్రికులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. గంగకు అవతలి ఒడ్డున ఉన్న దాన్ని వ్యాసకాశీ అని పిలుస్తారు. వేదవ్యాసుడు ఇక్కడే అష్టాదశ పురాణాలు రాశాడని ప్రతీతి.
వారణాసికి వెళ్లిన భక్తులు విశ్వనాథుడి దర్శనం తర్వాత ఆత్రుతగా ఎదురుచూసేది గంగా స్నానం గురించే. ఆ తర్వాత మనసుపడేది గంగమ్మకు నిర్వహించే హారతిపైనే. ప్రతి రాత్రి గంగమ్మతల్లికి లయబద్ధంగా ఇచ్చే హారతి మనోహరంగా ఉంటుంది. ‘గంగమ్మా నీవు వేద సారానివి, సకల జీవరాశులకు ఆహారం ఇవ్వడానికి పరమాత్మ నిన్ను సృష్టించాడ’ని స్తుతిస్తూ గంగామాతకు హారతి ఇస్తారు అర్చకులు. విశ్వనాథ ఆలయానికి సమీపంలోని దశాశ్వమేధ ఘాట్, రాజేంద్రప్రసాద్ ఘాట్, అస్సీ ఘాట్లలో గంగా హారతి నిర్వహిస్తారు. అస్సీ ఘాట్లో తొలి సంధ్యవేళలో హారతి ఇస్తారు. ఘాట్ సమీపంలో ‘సుబాహ్-ఎ-బనారస్’ వేదికగా దీనిని నిర్వహిస్తారు. ఇక్కడే పలు సాంస్కృతిక కార్యక్రమాలూ జరుగుతాయి. యోగసాధకులు అస్సీఘాట్ సమీపంలో ప్రతి ఉదయం యోగాభ్యాసం చేస్తూ కనిపిస్తారు. సూర్యోదయం సమయంలో అస్సీఘాట్ ప్రాంతానికి వెళ్తే ప్రశాంత కాశీని దర్శించుకోవచ్చు. దశాశ్వమేధ్, రాజేంద్రప్రసాద్ ఘాట్లలో సూర్యాస్తమయం తర్వాత హారతి నిర్వహిస్తారు. గంగమ్మను కీర్తిస్తూ, భజనలు చేస్తూ, మేళతాళాల విన్యాసాలకు దీటుగా అర్చకులు సమర్పించే హారతి అలౌకిక ఆనందాన్ని కలుగజేస్తుంది. యాత్రికులు పడవల్లో గంగానదిపై తేలుతూ హారతిని నేత్రపర్వంగా తిలకిస్తారు. ఈ సేవలో భక్తులు కూడా పాల్గొనవచ్చు. టికెట్ తీసుకున్న భక్తుల గోత్రనామాలు చెబుతారు.
శరీరంలో జీవుడు ఉన్నన్ని రోజులు, అనురాగ పరాయణత్వంతో వారణాసిలో జీవించాలి. సంకల్ప పూర్వకంగా మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి. కాశీ విశ్వేశ్వరుడిని గంధాక్షతలతో, ఫల పత్ర పుష్పాలతో పూజించాలి. ఆత్మ ధర్మాలైన శమదమాదులలో, తనకు విహితాలైన వర్ణధర్మాలలో,ఆశ్రమ ధర్మాలలో, దోషం దొర్లకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. తనశక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. వీటిని ఆచరించడం ద్వారా కాశీలో కైవల్యం లభిస్తుంది.
– కాశీఖండం
కాశీలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి బెనారస్ హిందూ యూనివర్సిటీ ( Banaras Hindu University ). 1916లో వసంత పంచమినాడు దీనిని ప్రారంభించారు. విద్యావేత్త మహామాన్య మదన్ మోహన్ మాలవీయ, అనీబిసెంట్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అప్పటి రాజులు, సంస్థానాదీశుల దగ్గరినుంచి విరాళాలు సేకరించి దీనిని నిర్మించారు. ఆనాటి అందమైన భవనాలు, వేలమంది విద్యార్థులతో విశ్వవిద్యాలయ ప్రాంగణం సందడిగా కనిపిస్తుంది. 2015లో వందేండ్ల ఉత్సవాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయంలో పురాతన గ్రంథాలు ఎన్నో చూడొచ్చు.
విశ్వనాథుడి కాశీలో శ్రీరాముడి లీలలు చూసే సౌభాగ్యం కలుగుతుంది. తులసీదాస విరచిత ‘రామచరిత మానస్’ ఆధారంగా రామ్లీలా కళాకారులు ప్రదర్శించే రామాయణ దృశ్యకావ్యం అపురూపం. ఉత్తరాదిలో రామ్లీలా ప్రదర్శనలు చాలా చోట్ల జరుగుతాయి. కానీ, వారణాసిలో నిర్వహించే ప్రదర్శనకు ఓ ప్రత్యేకత ఉంది. ఎక్కడైనా ఒకే వేదికపై నాటకాన్ని ప్రదర్శిస్తారు. కాశీలో మాత్రం సన్నివేశాన్ని బట్టి వేదికలు మారుతుంటాయి. కాశీలో జనకపురి, పంచవటి, లంక, అశోకవాటిక ఇలా.. రామాయణ కావ్యంలో పేర్కొన్న ప్రాంతాల పేరుతో పలు వేదికలు ఉన్నాయి. ఆయా ఘట్టాలను బట్టి వేదికలు ఎంచుకుంటారు కళాకారులు. ఆ వేదికపై ప్రదర్శించాల్సిన ఘట్టం పూర్తికాగానే, మరుసటి రోజు మరో సన్నివేశం ఇంకో వేదికపై ప్రదర్శిస్తారు. ఒక్కోసారి ఒకే రోజు రెండు మూడు వేదికలు మారుతూ రామాయణాన్ని ప్రదర్శిస్తారు. ఒక ఘట్టం పూర్తికాగానే నాటకాన్ని చూసేందుకు వచ్చినవాళ్లు కూడా కళాకారుల వెంట బయల్దేరి మరో వేదిక దగ్గరికి చేరుకుంటారు. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ఆశ్వయుజంలో నెల రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.
బెనారస్లో చూడాల్సిన మరో అద్భుత ప్రదేశం అక్కడి పట్టుచీరల తయారీ పరిశ్రమ. కాశీ, పరిసర గ్రామాల్లో వేలాది కుటుంబాలకు చీరలు నేయడం జీవనోపాధి. 14వ శతాబ్దం నుంచే కాశీలో చేనేత పరిశ్రమ ఉన్నట్టుగా తెలుస్తున్నది. కాలక్రమంలో పట్టుచీరల తయారీ కేంద్రంగా ప్రఖ్యాతిగాంచింది. సాధారణ నేత చీరలు మొదలు బంగారు తీగలతో నేసిన ఖరీదైన పట్టుచీరలూ ఇక్కడ దొరుకుతాయి. చీర అంచుకు పట్టుపోగులతోపాటు వెండి, బంగారు పోగులను కలిపి నేయటం బెనారస్ నేతకారుల ప్రత్యేకత. సాధారణ నూలు దుస్తులు తక్కువ ధరకే దొరుకుతాయి. పట్టుచీరల కొనుగోలు విషయంలో ఆచితూచి బేరమాడాల్సిందే. కాశీ చెంబు (గంగా జలం), కాశీ వీధిలో కొనే రుద్రాక్షమాల, బెనారస్ పట్టు చీర.. కాశీ యాత్రను జీవితకాలం గుర్తుండిపోయేలా చేస్తాయి.
‘కాశీ క్షేత్రంలో ఒక్క ప్రాణాయామం వల్ల మనిషి పొందే సమగ్ర ఫలసమృద్ధిని, ఏ ఇతర క్షేత్రంలోనూ అష్టాంగ సహిత యోగ మార్గం ద్వారా కూడా పొందలేరు’ అన్న కాశీఖండంలోని వాక్యాలు కాశీ యాత్రకు అందమైన ముగింపు.