Srisailam | శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం నుంచి పట్టు వస్ర్తాలు సమర్పించారు. మంగళవారం కాణిపాకం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు, అర్చక వేదపండితులు ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకోగా శ్రీశైల దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చక వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ పట్టు వస్ర్తాలను తలపై ఉంచుకుని స్వామిఅమ్మవార్లకు సమర్పించుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్నారు.
అనంతరం కాణిపాకం చైర్మన్ మాట్లాడుతూ జ్యోతిర్లింగమైన మల్లికార్జున స్వామి, శక్తిస్వరూపిణి భ్రమరాంబదేవికి బ్రహ్మోత్సవాల సమయంలో వినాయకస్వామి తరపున పట్టువస్ర్తాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.