హాలియా, ఏప్రిల్ 10: ‘నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యడమంటే రాష్ట్రంలో కరువును ఆహ్వానించడమే. కాం గ్రెస్కు ఓటేసినన్ని రోజులు కరువే తప్ప.. ఎప్పుడూ నీళ్లు రాలే. కరెంట్ కరువే. సాగు, తాగునీళ్లకూ కరువే. కాంగ్రెస్కు ఓటెయ్యడమంటే కరువుకు ఓటెయ్యడమే’ అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా శనివారం ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎ మ్మెల్యే సైదిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితో కలిసి తిరుమలగిరి సాగర్ మండలంలోని తెట్టెకుంట, అల్వాల, శ్రీరాంపురం, జానారెడ్డి కాలనీల్లో మంత్రి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు అరవై ఏండ్ల నుంచి కాంగ్రెస్కు ఓట్లేస్తున్నా.. ఇక్కడ సమస్యలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. 2014కు ముందు కాంగ్రెస్ పాలనలో జానారెడ్డి హయాంలో ఇక్కడి గ్రా మాల్లో కరెంట్ సమస్య ఉండేదని, రోజుకు ఐదారు గంటలకు మించి వచ్చేది కాదని తెలిపారు. మంచినీళ్లు, సాగునీటి సమస్య ఉండేదని, ఒక్కపూట తిండికి నోచుకోని వాళ్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఏడుసార్లు ఎమ్యెల్యేగా గెలుపొంది మంత్రి పదవులు అనుభవించిన పెద్దమనిషి జానారెడ్డి ఈ ప్రాంతానికి ఏమీ చెయ్యలేదన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యయాదవ్ పాల్గొన్నారు.