Yadadri Temple | యాదర్షి తపస్సును మెచ్చి వచ్చిన నరహరి శాంతమూర్తి. నవ్వు ముఖంతో జవ్వనికి తొడపై చోటిచ్చిన ప్రేమమూర్తి లక్ష్మీనరసింహుడు.నిండురూపుతో భక్తులను మెండుగా కరుణించే వేల్పునకు ఏడాదంతా వేడుకలే! ప్రతిదీ అద్భుతమే! ఏడాదికోసారి జరిగే బ్రహ్మోత్సవాలు స్వామి వైభవాన్ని రెట్టించి చూపుతాయి. కొత్త ఆలయం, సరికొత్త మాడవీధుల్లో యాదాద్రి నాయకుడి బ్రహ్మోత్సవాలు మరింత మనోహరంగా జరగనున్నాయి.
యాదాద్రి క్షేత్రంలో ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ విదియ మొదలు శుద్ధ ద్వాదశి వరకు సశాస్త్రీయంగా, లోకోత్తరంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. నిత్యపూజలు, కైంకర్యాలకు తోడు వేదమంత్రాల ఘోషతో స్వామివారి సన్నిధి మార్మోగుతుంది. పుష్పార్చనలు కొండగాలికి పరిమళం అద్దుతాయి. అలంకారాలు అలౌకిక ఆనందాన్ని
కలిగిస్తాయి. వాహన సేవలు అబ్బురపరుస్తాయి.
స్వస్తి వచనంతో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు విష్వక్సేనుడి ఆరాధనతో ఊపందుకుంటాయి. ధ్వజారోహణంతో సమస్త దేవతలకూ ఆహ్వానం పలుకుతారు అర్చకులు. ఆ పిలుపు అందుకొని అష్ట దిక్పాలకులు ఇష్టంగా వస్తారు. ఇంద్రాది దేవతలు పరుగు పరుగున విచ్చేస్తారు. ఆగమేఘాల మీద వచ్చిన ముక్కోటి దేవతలకు 33 రాగాల్లో, 33 తాళాల్లో, 33 వేదమంత్రాలు పఠిస్తూ సశాస్త్రీయంగా స్వాగతం పలుకుతారు. ఒక్కో దేవతకు మూడురకాల ఉపచారాలు చేసి బ్రహ్మోత్సవంలో పాలుపంచుకోవాలని కోరుతారు. ఇలా వచ్చిన దేవతలంతా అలా బాసింపట్టు వేసుకొని కూర్చుంటారు. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు స్వామివారి సన్నిధిలోనే కొలువుదీరుతారు. బ్రహ్మదేవుడి ఆధ్వర్యంలో ఉత్సవాలన్నీ కన్నులపండువగా కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, దివ్యవిమాన రథోత్సవం, చక్రతీర్థ స్నానం ప్రధానమైనవి. 11 రోజులు జరిగే ఈ ఉత్సవాలు అష్టోత్తర శతఘటాభిషేకంతో పూర్తి అవుతాయి.
బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మానందం కలిగించే ఘట్టం స్వామివారి కల్యాణం. సభా స్థానంలో నరసింహస్వామిని పెండ్లికొడుకును చేసే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఉత్సాహంగా ముస్తాబైన ఉత్సవమూర్తిని దర్శించుకోవడం జన్మకో అదృష్టం. ఎదుర్కోలు సందర్భంగా స్వామి, అమ్మవారి గుణగణాలను అర్చకులు ఆసక్తికరంగా తెలియజేస్తారు. అయ్య తరఫు అర్చకులు స్వామివారి రూపలావణ్యాన్ని పొగిడితే.. అమ్మవారి పక్షం అయ్యవార్లు మా ఇంతి రూపం అంతకుమించి ఉంటుందని పరిహాసమాడతారు. స్వామి ఉగ్రరూపాన్ని వేనోళ్లా వర్ణిస్తే.. అమ్మవారిని చూడటంతోనే శాంతమూర్తి అయ్యాడని ఆటపట్టిస్తారు. ఇలా కోలాహలంగా సాగుతుంది ఎదుర్కోలు మహోత్సవం. సకల దేవతల సమక్షంలో కల్యాణం జరిపిస్తారు అర్చకులు. పట్టువస్ర్తాలు, స్వర్ణాభరణాలతో లక్ష్మీదేవి, నరసింహస్వామిని అందంగా ముస్తాబు చేస్తారు. నరసింహుడు గజవాహనంపై మంటపానికి ఊరేగి రాగా, పూల పల్లకీలో అమ్మవారు తరలి వస్తుంది. సముద్ర దేవుడే స్వయంగా వచ్చి నరకేసరి పాదాలు కడిగి అమ్మవారిని ఆయనకు అప్పగించాడన్న అనుభూతికి లోనై ఈ సందర్భాన్ని కళ్లప్పగించి చూసి తరిస్తారు భక్తులు. మాంగల్య ధారణ, తలంబ్రాల ఉత్సవం జరిగినంత సేపూ కల్యాణ మంటపం గోవింద నామస్మరణతో మార్మోగుతుంది. చివరగా చక్రతీర్థ స్నానం, పుష్పయాగం, మహా పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.
బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు సమర్పించే పట్టువస్ర్తాలు పోచంపల్లికి చెందిన చేనేత సంఘం రూపొందిస్తుంది. నేతన్నలు నియమ, నిష్ఠలు పాటిస్తూ ఎనిమిది రోజులపాటు శ్రమించి మగ్గంపై వీటిని అందంగా తీర్చిదిద్దుతారు.