శ్రీశైలం : దసరా మహోత్సవాలు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన ఈవో లవన్న గురువారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ఆలయ ముఖద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేసి ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారి యాగశాల ప్రవేశం గణపతిపూజ అఖండదీపస్థాపన మండపారాధన తదితర పూజాకార్యక్రమాలు జరిగాయి. ప్రధాన అలాగే స్వామివారి ఆలయ యాగశాలా ప్రవేశం, శివసంకల్పం, గణపతి పూజ, చండీశ్వర పూజ,వాస్తు పూజ, రుద్రకలశ స్థాపన, స్వామివారికి మహన్యాసపూర్వక రుధ్రాభిషేకం చేశారు.
మధ్యాహ్నకాలార్చన, సహస్రనామార్చన, మహానివేదన అనంతరం సాయంకాలం జపానుష్టానాలు, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, నవవార్చన, కుంకుమార్చన, రుద్రహోమం, చండీహోమాలతో పాటు శ్రీశైల ఖండ మహాపురాణ పారాయణం నిర్వహించినట్లు అర్చకులు భద్రయ్య, మార్కండేయ శర్మ తెలిపారు. రాత్రి సువాసినీ పూజ, కాళరాత్రిపూజలతో తొలిరోజు నవరాత్రి మహోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించినట్లు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డితోపాటు పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్కుమార్, ఏఈఓ మల్లయ్య, హరిదాసు, పర్యవేక్షకులు శ్రీహరి, సెక్యూరిటీ అధికారి నర్సింహారెడ్డి, అయ్యన్న, రవికుమార్, చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
భృంగివాహనంపై ఆదిదంపతుల దర్శనం
దసరా మహోత్సవల్లో భాగంగా తొలిరోజు భ్రామరీ అమ్మవారు శైలపుత్రిగా భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భ్రామరి సహిత మల్లికార్జునుడు భృంగివాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వర్షం కారణంగా ఆలస్యమైనప్పటికీ ప్రాకారోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లను ఆలయ మాఢ వీధుల్లో ఊరేగించారు. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, ఝాంజ్పధక్, కన్నడ డోలు, ఢమరుకం, శంఖం, బిడతలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది. ఇదిలా ఉండగా.. ఉత్సవాల్లో రెండో రోజు అమ్మవారి బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనం ఇవ్వనుండగా.. మయూరవాహన సేవ నిర్వహించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు.