తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. మరో వైపు సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేతతో భక్తులు ఆందోళనకు దిగారు. వరుసగా సెలవులు రావడంతో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అయితే, శనివారం రోజే ఆది, సోమవారాలకు సంబంధించిన టోకెన్ల జారీ పూర్తికావడంతో అధికారులు, టోకెన్ల జారీని నిలిపివేశారు.
సరిగా ప్రచారం లేకపోవడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకున్నారు. టోకెన్లు జారీ చేయాలని భక్తులు ఆందోళనకు దిగారు. టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో రెండేళ్లుగా రద్దు చేసిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలను దేవస్థానం పునరుద్ధరించింది. రోజుకు వెయ్యి చొప్పున టైమ్ స్లాటెడ్ టోకెన్లను ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. టోకెన్లు తీసుకున్న భక్తులను ప్రతి రోజు ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతి ఇస్తున్నది.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం లక్ష్మణ్, నావెల్ చీఫ్ అడ్మిరల్ హరి కుమార్, సినీ నటులు జీవిత రాజశేఖర్ దంపతులతో పాటు కుమార్తెలు శివాణి, శివాత్మికతో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. మే నెలలో రాజశేఖర్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చామని జీవిత తెలిపారు.
అమెరికాకు చెందిన రవి ఐకా అనే వ్యక్తి ఎస్వీబీసీకి రూ.1.32 కోట్లు విరాళం అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విజయవాడకు చెందిన రామకృష్ణ అనే దాత ప్రతినిధి విరాళం డీడీని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఎస్వీబీసీకి అవసరమైన కెమెరాల కొనుగోలుకు దాత ఇప్పటికే రూ.7 కోట్లు విరాళం ప్రకటించగా, అందులో రూ.4.20 కోట్లు అందజేశారు.