ఆత్మాభాసస్య జీవస్య సంసారో నాత్మవస్తునః
ఇతి బోధో భవేద్విద్యా లభ్యతేసౌ విచారణాత్
(వేదాంత పంచదశి)
‘చిదాభాసుడైన జీవుడికే సంసారం ఉంది కానీ, ఆత్మకు కాదు’ అని తెలుసుకోవటమే జ్ఞానం లేద బోధ అవుతుంది. ఆ జ్ఞానం చక్కటి ఆత్మతత్త్వ విచారంతో మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మోక్షా పేక్ష కలిగినవాడు నిరంతరం ఆత్మతత్త్వాన్ని చింతనచేయాలి. ఏది ఎల్లప్పుడూ ఉంటుందో, ఏది వికారాలు లేనిదై ఉంటుందో, ఈ చరాచర జగత్తు మొత్తానికీ ఏది మూలకారణమై ఉందో అదే బ్రహ్మమనీ, పరమాత్మ అనీ వేదాలు, శాస్ర్తాలు చెప్తున్నాయి. ‘పరమాత్మ ఒక్కడే సత్యం! మిగతావన్నీ అంటే ఈ ప్రపంచం, జీవులు అన్నీ కల్పితాలే! వాస్తవాలు కాదు!!’ అని తెలుసుకోవడమే జ్ఞానం. జీవించి ఉండగానే జ్ఞానం కలగడం వల్ల సంసారబంధం తొలగిపోతుంది. దీన్నే ‘జీవన్ముక్తత’ అంటారు.
రుగ్వేదానికి చెందిన ఐతరేయారణ్యక ఉపనిషత్తు ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అని పేర్కొన్నది. జీవుడు ఏ చైతన్యం ఆధారంగా చేసుకొని ఇంద్రియాల సహకారంతో విషయాన్ని గ్రహిస్తున్నాడో, ఆ చైతన్యాన్నే అంటే అంతఃకరణ వృత్తితో అన్ని ఇంద్రియాల ద్వారా బయటకు వ్యాపించిన చైతన్యాన్ని ‘ప్రజ్ఞానం’ అంటారు. ఇక బ్రహ్మాది దేవతలలో గానీ, మనుషులలో గాని, వివిధ జంతుజాలంలో గానీ, జడపదార్థాల్లో గానీ అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఏ చైతన్యం సర్వ సామాన్యంగా వ్యాపించి ఉందో అదే బ్రహ్మం. ఇలా బయటకు వ్యాపించినది, అన్నిటిలోనూ అంతర్గతమైన చైతన్యమే పరబ్రహ్మం అంటుంది ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనే మహా వాక్యం.
యజుర్వేద శాఖకు చెందిన బృహదారణ్యక ఉపనిషత్తు ‘అహం బ్రహ్మాస్మి’ అనే మహా వాక్యాన్ని ప్రతిపాదించింది. ‘నేను బ్రహ్మమునై ఉన్నాను’ అని దీని అర్థం. దేశకాలాలతో పరిచ్ఛిన్నం (విచ్ఛిన్నం) కాని మాయాకల్పితమైన ఈ జగత్తులోని జీవులన్నిటిలో సాక్షిగా ఉన్న ‘నేను’ అన్నదే బ్రహ్మం! జీవేశ్వరులను ఐక్యంగా చెప్పే ఈ నేనే పరబ్రహ్మం అని ‘అహం బ్రహ్మాస్మి’ వాక్యం చెప్తున్నది!
సామవేదంలోని ఛాందోగ్యోపనిషత్తు ‘తత్త్వమసి’ అని ప్రతిపాదించింది. ‘జీవుడే బ్రహ్మమై ఉన్నాడు’ అని ఈ వాక్యానికి అర్థం. ‘అది నీవే అయి ఉన్నావు’ అని భావం. ఇక్కడ తత్ అంటే బ్రహ్మం. త్వం అంటే జీవుడు. జీవుడే బ్రహ్మమై ఉన్నాడని అర్థం. సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు లేనిది. నామరూపాలు లేనిది, సృష్టికి పూర్వం ఏది ఉన్నదో, సృష్టి నశించిన తర్వాత ఏది మిగిలి ఉంటుందో అది బ్రహ్మం. దానినే ‘తత్’ అన్నారు. శరీరాదుల యందు సాక్షిగా ఉన్న జీవుణ్ని ‘త్వం’ శబ్దం సూచిస్తుంది.
అథర్వణ వేదం ‘అయమాత్మా బ్రహ్మ’ అను మహావాక్యాన్ని ప్రతిపాదించింది. ‘అయం’ అంటే వీడు అనీ, ఇది అనీ అర్థం. ఇది స్వప్రకాశకం. తనకుతాను చెప్పుకొనేది (తెలిసేది) అనుభవపూర్వకం. అహంకారం మొదలుకొని దేహం చివరివరకు అంతర్గతంగా ఉండి ప్రత్యగాత్మగా చెప్పబడిందే ‘అయం’. ఈ ప్రత్యగాత్మే బ్రహ్మం అని ఈ వాక్యానికి అర్థం.
జ్ఞానం.. పరోక్ష, అపరోక్ష అని రెండురకాలు. ఈ మహావాక్యాలను విచారిస్తే పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం రెండూ కలుగుతాయి. శాస్ర్తాది విషయాల వల్ల, సత్సంగం వల్ల ‘పరమాత్మ ఉన్నాడు’ అని తెలుసుకోవడం పరోక్ష జ్ఞానం. ఈ విషయాలను నిరంతరం మననం చేస్తూ, ఆత్మ చింతన చేయడం ద్వారా ‘తానే బ్రహ్మం’ అని తెలుసుకోవడం అపరోక్ష జ్ఞానం. అంటే తనకు, పరమాత్మకు భేదం తొలగిపోయి స్వస్వరూప జ్ఞానం కలగడం. పరోక్ష జ్ఞానం అంటే శాస్ర్తాల ద్వారా గ్రహించిన జ్ఞానం. అపరోక్ష జ్ఞానం అంతమయ్యేంతవరకు, అంటే తన అనుభవంలోకి వచ్చేంత దాకా ఆత్మ తత్వ విచారణ చేస్తూ ఉండాలి. అదే నిజమైన సాధన.
దోర్బల కుమారస్వామి