కాలంతోపాటు మానవ సంబంధాలు అడుగంటుతున్నాయి. అనుబంధాలు, అనురాగాలు ఆర్థిక అవసరాలచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మనం చేసే స్నేహాలు, మన చుట్టూ ఉన్న మనుషులే ఇలాంటి వైఖరులు ప్రబలడానికి కారణం.
సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే॥ (భగవద్గీత 6-9)
“సుహృతులు’ అంటే ప్రత్యుపకారం ఆశించకుండా ఉపకారం చేసేవాళ్లు. మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు, మధ్యస్థులు, ద్వేషులు, బంధువులు, సత్పురుషులు, పాపాత్ములు వీరందరి విషయంలోనూ సమానమైన ఆదరణ బుద్ధి కలవాడు ఉత్తముడు, శ్రేష్ఠుడు’ అంటుంది భగవద్గీత.
వస్తువులు జడ పదార్థాలు. వాటిని మనం అంగీకరించినా, ఇష్టపడకపోయినా, ద్వేషించినా మనలోనే అలజడి రేగుతుంది. వాటి నుంచి ఎలాంటి ప్రతిక్రియ ఉండదు, రాదు. మరి మనుషుల విషయంలో అలా కాదు. మనం ప్రదర్శించే రాగద్వేషాలకు అనుగుణంగా అవతలి వైపు నుంచి కూడా ప్రతిక్రియ ఉంటుంది. మనం ఏది ఇస్తే.. ఫలితంగా మనకు అదే వస్తుంది. స్వభావాలను బట్టి ఈ సృష్టిలోని మనుషులను ఎనిమిది తరగతులుగా విభజించాడు పరమాత్మ. వీరిలో ప్రథములు సుహృతులు. వీరి పేరులోనే మంచి నడవడి ఉన్నది. మంచి హృదయంతో ఉంటారు. ఎదుటివారికి ఎప్పుడూ ఉపకారం చేయాలనే తత్వం కలిగి ఉంటారు. చెడు, అపకారం అంటే వీరికి తెలియదు.
రెండోది- మిత్రులు. మిత్రత్వం గొప్ప పదం. కల్మషం లేనిదే స్నేహం. ఆపదలలో, కష్టాలలో ఆదుకునే వాడే అసలు సిసలైన మిత్రుడు. స్నేహితుల మధ్య అంతరాలు ఉండవు. కులం,ధనం, ఆడ, మగ ఇటువంటి వివక్షకు తావుండదు. స్నేహానికి వయోపరిమితులు కూడా అడ్డుకావు. ‘బతికి బంధువు ఇంటికి, చెడి స్నేహితుడి ఇంటికి’ అనే సామెత స్నేహం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. కానీ, కాలచక్రంలో స్నేహం కూడా ఆర్థిక అవసరాల మధ్య నలిగిపోతుండటం బాధాకరం.
మూడో రకం- ఉదాసీనులు. అంటే తటస్థులు. వీరు ఎవరి పక్షమూ ఉండరు. ఎవరికీ కొమ్ముకాయరు. జరిగే విషయాలను కేవలం సాక్షిగా చూస్తూ ఉండిపోతారు. ఏది ఎలా జరిగినా పట్టించుకోరు. నాలుగో రకం- మధ్యస్థులు. ఇద్దరి మధ్య తగాదా వచ్చినప్పుడు న్యాయం చెబుతారు. వీరు కూడా ఎవరి పక్షమూ వహించరు. వీరి దృష్టిలో ఇద్దరూ కావాల్సిన వారే! ఐదో రకం మనుషులు ద్వేషులు. వీరికి ఈ లోకంలో ఎవరూ గిట్టరు. ఒక రకమైన మనసత్వం కలిగి ఉంటారు. ఎదుటివారు ఎదుగుతుంటే ఓర్వలేరు. తామే బాగుపడాలి, ఇతరులు నాశనం కావాలని కోరుకుంటారు. డబ్బున్న వాళ్లనే అభిమానిస్తారు. వారితోనే సంబంధాలు నెరుపుతారు. ఒక విధంగా చెప్పాలంటే భారతంలో దుర్యోధనుడి లాంటి వారన్నమాట.
బంధువులు ఆరో రకం. వీరు అందరినీ కావాలి అనుకుంటారు. అందరూ తమ వారేనని తలుస్తూ ఉంటారు. తన అనుకున్న వారిని అవసరానికి ఆదుకుంటా రు. ఏడో రకం- సాధువులు. వీరు చాలా మృదుస్వభావులు. ప్రతి చిన్న విషయానికీ కదిలిపోతారు. కష్టం కలిగించే వార్త విన్నా, దృశ్యం చూసినా విచలితులు అవుతారు. వీరి హృదయం కోమలంగా ఉంటుంది. ఎనిమిదో రకం- పాపేషు. అంటే పాపులు. వీళ్లకు దైవప్రీతి, పాపభీతి ఉండదు. పాపాలు చేస్తూ ఉంటారు. జాలి, కరుణ ఉండవు. జీవితమంతా తప్పులు చేస్తూనే ఉంటారు. చివరకు అర్ధంతరంగా తనువు చాలిస్తారు.
ఇలా మనుషుల్లో రకాలను చెబుతారు. ఇందులో సుహృతులు, సాధువులు, బంధువులు చెప్పుకోదగిన వారు. ఇలాంటివారితో అనుబంధం కొనసాగించా లి. వారి నుంచి ప్రేరణ పొంది మనమూ ఆ విధంగానే నడుచుకోవాలి. అన్నిటిని మించి కన్న తల్లిదండ్రుల ప్రేమ, వాత్సల్యం, దయ వెలకట్టలేనివి. వారి మనసు గుర్తెరిగి మన ప్రవర్తన ఉండాలి. సాటి మనుషులను ప్రేమతో జయించాలి. అనురాగంతో దగ్గర చేసుకోవాలి. అప్పుడు ఈ జగమంతా వసుధైక కుటుంబమే!
కనుమ ఎల్లారెడ్డి
93915 23027