కోదాడ : కోదాడ పెద్ద చెరువును ఆక్రమించుకున్నారని, వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పట్టణ పరిధిలోని సాయిబాబా థియేటర్ సమీపంలోగల వీధులలో రేకుల ఇల్లు, గుడిసెల వాసులు 372 మందికి రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీసులు జారీచేశారు. చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. దాంతో బాధితులు కంటిమీద కునుకు లేకుండా భయంభయంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో సోమవారం బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆ ప్రాంతంలో పర్యటించారు. అధికారుల నుంచి నోటీసులు అందుకున్న బాధితులకు గుండె ధైర్యం చెప్పి ఓదార్చారు. నోటీసులు అందుకున్న 372 మందిలో 200 మంది కూలీనాలీ చేసుకుని బతికే నిరుపేదలు ఉండటం గమనార్హం.
తాము 50 ఏళ్ల నుండి ఇక్కడే జీవిస్తున్నామని, 40 గజాల స్థలంలో ఇల్లు కట్టుకొని పొట్ట కూటి కోసం కూలీపనులు చేస్తూ బతుకుతుంటే ఈ మాయదారి నోటీసులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వేల గజాల ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, మా మీద ఈ జులుం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని చంపిన తర్వాతే మా ఇల్లు కూలగొట్టాలని మాజీ ఎమ్మెల్యే ముందు చెప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, మీకు అండగా నేనుంటానని బాధితులకు భరోసా ఇచ్చారు. బాధితులు ఆక్రమణదారులైతే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నప్పుడు ఈ విషయం ఎందుకు గుర్తుకురాలేదని అసహనం వ్యక్తంచేశారు.
కోర్టు నోటీసుల పేరుతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు బాధితులను భయభ్రాంతులకు గురిచేయడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే అన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులే బాధితుల పక్షాన నోటీసులకు సమాధానం చెప్పాలన్నారు. ఓ పక్క కోదాడ మున్సిపాలిటీ పరిధిలో కొందరు అధికారులు లంచాలకు అలవాటుపడ్డారని, ప్రభుత్వ స్థలాలను ఇష్టారాజ్యంగా ఆక్రమించుకొని అపార్టుమెంట్లు కట్టుకున్న దురాక్రమణదారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా నిరుపేదలను ఆక్రమణదారులు అనటం దారుణమని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. మరొక్కసారి బాధితులను ఇబ్బంది పెడితే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. బాధితులకు అండగా ఉంటామని, మీ ఇళ్లకు నేనే భరోసా అని బాధితులకు గుండె దైర్యం చెప్పారు. ఆయన వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీమ్, మాజీ కౌన్సిలర్ చింతల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.