కన్యగా సంతానం కనడం అధర్మం. శిశువు దేవతాంశ అయినా ఒడుదొడుకుల జీవితమే గానీ, ప్రకృతి సహకరించదు. లోకుల సానుభూతి లభించదు. దీనికి కర్ణుని జీవితమే సాక్షి. కుంతీదేవికి ధర్మరాజాదులు వివాహానంతరం భర్త ఆదేశానుసారం దేవతాంశలతో జన్మించారు. వాళ్లు ధర్మవీరులయ్యారు. వాళ్లకు మాత్రం కష్టాలు రాలేదా? అనవచ్చు. ఎటువంటి ఆపదనుంచైనా రక్షించే శ్రీకృష్ణ భగవానుడు వారికి తోడుగా నిలిచాడు. కర్ణుడికి అలా అండగా ఉండలేదు.
నాటి సమాజంలో మహిళ వివాహానికి ముందు తండ్రి అధీనంలో, వివాహం తర్వాత భర్త అధీనంలో ఉండేది. దుర్వాసుడు ఇచ్చిన మంత్రంతో సూర్యుడిని ఆహ్వానించింది కుంతి. సూర్యుడు వచ్చి ‘నీకు సంతానం ప్రసాదిస్తాను’ అన్నాడు. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు. కానీ, అప్పటికింకా వివాహం కాని కుంతి ‘తండ్రి అనుమతి తీసుకొని వస్తా’ననలేదు. అక్కడే అధర్మబీజం పడింది. కుంతికి సూర్యుడి అనుగ్రహంతో పుట్టిన కర్ణుడే ఆమె ధర్మసంతానమైన పాండవులకు ప్రమాదమయ్యాడు.
కర్ణుడు సూర్యాంశతో సహజ కవచ కుండలాలతో జన్మించిన మహావీరుడు. కానీ, అతనికి ధర్మం మీద కంటే పేరుమీదనే మహా ప్రీతి. రాజుగా పేరొస్తుం దంటే.. అంగరాజ్యం ధారబోసిన దుర్యోధనుడికి ఆజన్మాంతం రుణపడి ఉంటానని, తను మనధనాలతో సహకరిస్తానని మాట ఇచ్చాడు. దుర్యోధనుడికి తన జీవితం అంకితం చేశాడు. రాజ్యం ఇచ్చాడన్న కృతజ్ఞతతో ధర్మాధర్మ విచక్షణ మానుకొని దుర్యోధనుణ్ని ప్రతి చోటా సమర్థించాడు. పాండవులను ఎదిరించడానికి కొత్త శక్తులను పోగుచేసుకున్నాడు. అధర్మ యుద్ధంలో అభిమన్యుడి వధకు కారకుడయ్యాడు. అయితే, తన అంశలో జన్మించిన అర్జునుడి విజయం కోసం దేవేంద్రుడు రంగంలోకి దిగాడు. కర్ణుడి సహజ కవచ కుండలాలు కోరాడు. దాన కర్ణుడని పేరొస్తుందని వాటిని అతడు ఒలిచి ఇచ్చేశాడు. దుర్యోధనుడికి ఇచ్చిన మాట విస్మరించాడు. బలహీనుడయ్యాడు.
యుద్ధానికి ముందే కుంతీదేవి రహస్యంగా వెళ్లి కర్ణుడితో ‘నీవు నా కొడుకువే!’ అని చెప్పి ‘పాండవులను రక్షించు’ అని ప్రాధేయపడింది. ‘నేను మాత్రం నీ కొడుకును కానా! నేను బాగుండాలని లేదా?’ అన్నాడు కర్ణుడు. తలదించుకున్నది కుంతి. కర్ణుడు పుట్టినప్పడే అపనిందకు వెరచి పసికందును గంగలో పడవేసింది కదా! ఇప్పుడు మాత్రం తన బాగునెలా కోరుతుంది? పెండ్లికి ముందే కర్ణుడికి జన్మనిచ్చి ధర్మం తప్పింది. ఆ పాపమే కర్ణుడికి శాపమైంది. ఆదరించేవారు కరువై, ఎలాంటివాడైనా తనను గుర్తించినందుకు దుర్యోధనుడి పక్షం చేరాడు.
అర్జునుణ్ని రక్షించడానికి దేవేంద్రుడు యత్నించినట్టు, సూర్యుడు తన అంశతో జన్మించిన కర్ణుడి కోసం అర్జునుడిని యాచించలేదు. కృష్ణుడిని బతిమాలు కోలేదు. శ్రీకృష్ణుడు భూభారం తగ్గించేందుకు దిగివచ్చిన అవతారం అని అప్పటికే తేటతెల్లమైంది. అర్జునుడు యుద్ధభూమిలో కర్ణుడిపై అస్త్ర ప్రయోగం చేస్తుంటే.. సూర్యుడు అడ్డుపడలేదు. కృష్ణ సంకల్పానికి అడ్డేది? ఆయన రామావతారంలో సూర్యాంశ అయిన సుగ్రీవుని సాయంతో ఇంద్రాంశ అయిన వాలిని తెగటార్చినాడు. ఇప్పుడు ఇంద్రాంశ అయిన అర్జునుడి సాయంతో సూర్యాంశగా జన్మించిన కర్ణుడిని మట్టుబెట్టబోతున్నాడు. ధర్మపక్షమే తప్ప వ్యక్తి పక్షపాతం లేదు కృష్ణుడికి. అధర్మ పక్షం వహిస్తే దేవతాంశలైనా నీరుగారి పోవాల్సిందే! అప్పుడు వాలి అయినా, ఇప్పుడు కర్ణుడైనా! వ్యక్తిగత స్వార్థం కోసం అధర్మం పంచన చేరి తనకు తాను వంచన చేసుకున్నాడు కర్ణుడు. ఫలితం దాన కర్ణుడన్న పేరు ఉన్నా.. అధర్మవాది అన్న అపకీర్తినీ మూటగట్టుకున్నాడు.
డాక్టర్ వెలుదండ సత్యనారాయణ
94411 62863