దేవుని కుమారుడైన క్రీస్తు ఏసు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, తనను తాను రిక్తునిగా చేసుకొని, నరావతారుడిగా ఈ లోకంలో జన్మించాడు. ప్రతి మనిషినీ పాపాల నుంచి రక్షించడానికి, నరకబాధ తప్పించి పరలోక రాజ్యాన్ని ఇవ్వడాని కి ఆయన భూమిమీదికి వచ్చాడు. అలాంటి ఏసు క్రీస్తు రక్షణ సువార్తను ఎలా వింటున్నాం? నిజ జీవితంలో దాన్ని ఎలా అనుసరిస్తున్నాం? ప్రియ సహోదరి, సహోదరులుగా.. క్రీస్తు రక్త మాంసాలలో పాలుపంచుకుంటున్న ఆయన బిడ్డలుగా, ఈ క్రిస్మస్ వేళ తండ్రియైన క్రీస్తుతో ఒక ఒడంబడిక చేసుకుందాం. పరలోక రాజ్యానికి వారసులమవుదాం.
2021 ఏండ్ల కిందట బెత్లెహేము నగర ఆకాశవీధుల్లో దేవదూతల గణాలు ఒక సుమధుర సువార్తను ప్రకటించాయి. అది ఇప్పటికీ విశ్వమంతటా తన భక్తుల ద్వారా ప్రకటితమవుతూనే ఉంది. ఆ సువర్తమానమే.. ‘ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’- (లూకా 2:10,11) సమస్త మానవాళికి రక్షణ తక్షణ అవసరం. ‘నేను పాపిని కాదుగదా! నాకు రక్షణ అవసరం ఏమొచ్చింది?’ అని ప్రశ్నించే ముందు.. మనలను మనం ప్రశ్నించుకునే తరుణమిది. క్రీస్తు బోధనలను మనసా, వాచా, కర్మణా పాటించే వాళ్లే ఆయన రాజ్యానికి వారసులు. సృష్టికి మూలకారకులైన ఆదాము, హవ్వ దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు. ఆయన కోపానికి గురై, దేవుని పవిత్ర సహవాసాన్ని, సన్నిధిని పోగొట్టుకున్నారు. పాపానికి వచ్చే ఫలితం మరణం. ఆ మరణం తర్వాత మన ఆత్మ ప్రయాణం పరలోకం వైపే ఉండాలి. నిత్య నరకాగ్నివైపు కాదు.
‘దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకొంటే.. నమ్మదగిన వాడు, నీతిమంతు డు కాబట్టి అయన మన పాపాలను క్షమించి, సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు’- (1యోహాను 1:9). అందుకు ప్రభువైన క్రీస్తు ఏసుపై విశ్వాసం ఉంచాలి. దేవుని తీర్పునకు ముందే మన ప్రవర్తనలో మార్పు రావాలి. మన భారాన్ని మొత్తం ఆయనపై మోపమని క్రీస్తు భరోసా ఇస్తున్నాడు. ఆయన మార్గాన్ని అనుసరించాలంటే మనలో గూడుకట్టుకున్న ఓర్వలేనితనం, అసంతృ ప్తి, కోపం, అసూయ, కామం, అపవిత్ర తలపులను విడిచిపెట్టాలి. సాటి మను షులకు క్రీస్తు ప్రేమను పంచాలి. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు.. పొరుగువారినీ ప్రేమించాలి. ఇవేవీ చేయకుండా ప్రతివారం చర్చికి వెళ్లినా, దేవుణ్ని దివారాత్రాలు స్తుతించినా వ్యర్థమే.
తల్లిదండ్రులు చేసే తప్పులు, పాపాల తాలూకు దుష్ప్రభావం వారి పిల్లలపై, తర్వాతి తరాలపైనా ఉంటుంది. కాబట్టి, చిన్నతనంలో దేవుని మార్గాన్ని పిల్లలకు బోధించాలి. పెద్దవారయ్యాక వారు దైవ మార్గం నుంచి తొలిగిపోరన్న ది బైబిల్ తీర్పు (సామెతలు 22:6). ఇక పిల్లల ప్రవర్తనపైనా తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి. ‘బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము. అయితే వాడు చావాల ని కోరవద్దు’- (సామెతలు 19:18) అని బైబిల్ స్పష్టం చేస్తున్నది. ‘ఆ క్రమశిక్ష ణ కూడా ప్రేమతో ఉండాలి. లేకపోతే పిల్లలు వ్యతిరేకంగా, నిరుత్సాహంతో, తిరుగుబాటు తత్త్వంతో ఎదుగుతారు’- (కొలస్సీ. 3:21).
‘పాపులను రక్షించుటకు వచ్చిన రక్షకుడు మీ కొరకు పుట్టిఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు’- (లూకా 2:11) అనే ఈ సువర్తమానం సిలువలో కార్యరూ పం దాల్చింది. ఆయన పొందిన దెబ్బల నుంచి మనకు స్వస్థత కలుగుతున్నది. యెహోవా మనందరి దోషాలను ఏసు క్రీస్తు మీద మోపాడు (యెషయా 53:5,6). క్రీస్తు ఏసు పాపాల నిమిత్తం సిలువలో తన పవిత్ర రక్తాన్ని చిందిం చాడు. మరణాన్ని జయించి, మూడోనాడు సమాధి నుంచి మృత్యుంజయుడై తిరిగి లేచి వచ్చాడు. మనకు రక్షణనిచ్చి మనందరి కోసం తండ్రితో నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే, ‘నా ద్వారానే తండ్రి రాజ్యాన్ని చేరుకోగలరు’ అని రూఢిగా చెబుతున్నాడు ఏసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరులారా.. నేడే రక్షణ దినం. ఈ క్రిస్మస్ పర్వదినం మీ జీవితంలో నిజమైన రక్షణదినం కావాలి. శాంతి సమాధానాలు, ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా అందరూ పొందాలి.
రెవ.కత్తి విక్టర్పాల్
96187 36377