ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ..
దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా..
(భగవద్గీత 16-5, 6)
ఈ సృష్టిలో దైవగుణాలు కలవారు, అసుర గుణాలు కలవారు అని రెండు రకాల మనుషులుంటారు. దైవ గుణాలు మోక్షానికి కారణమైతే, అసుర గుణాలు బంధానికి కారణం అని భగవద్గీత చెప్తున్నది. అహింస అంటే మాటల వల్ల గానీ, చేతల వల్ల గాని, మానసికంగా గాని ఇతరులకు కష్టం కలిగించకుండా ఉండటం. కోపం లేకుండుట, ద్రోహబుద్ధి లేకుండుట, పెద్దలను, గురువులను గౌరవించడం, అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండటం, ఎవరినీ నిందించకుండా ఉండటం, ఇతరుల తప్పులను క్షమించడం, రుజు ప్రవర్తన కలిగి ఉండటం (కపటం లేకుండుట), సర్వకాల సర్వావస్థల్లోనూ పరమాత్మలో మనసు నిలిపి ఆయన అనుగ్రహం పొందడానికి ప్రయత్నించడం మొదలైనవి ఉత్తమ మానవుడి లక్షణాలు. వీటినే దైవీ సంపదలు అంటారు.
కపటం, దర్పం, అభిమానం, కోపం, పౌరుషం (కఠిన స్వభావం), అజ్ఞానం మొదలైనవి అసుర గుణాలు. ఏ మనిషి అయినా కూడా తనలో ఉండే చెడు గుణాలను తొలగించుకొని, మంచి లక్షణాలను అలవాటు చేసుకోవాలి. అయితే చాలామందికి తమలో చెడు గుణాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు. ఎవరికి వారు తమను తాము ఉత్తములుగా భావించుకుంటూ ఉంటారు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ అసుర గుణాలు కలవారి ప్రవర్తన ఎలా ఉంటుందో విస్తరించి చెప్పాడు.
అసుర గుణములు కలవారికి సరైన విచక్షణ జ్ఞానం ఉండదు. చేయవలసింది ఏమిటి? చేయకూడనిదేమిటి అనే విషయాలు స్పష్టంగా తెలియదు. వీరిలో ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహం ఉండదు. సత్యం పలకడం చేతకాదు. శుచి, శుభ్రతల గురించి పట్టించుకోరు. సాధారణంగా వీరు పరమాత్మ ఉనికిని అంగీకరించరు. వీరి దృష్టిలో ఈ సృష్టికి కారణం ‘కామమే’. స్త్రీ, పురుషుల కలయిక వల్లే సృష్టి ఏర్పడుతున్నది అని భావిస్తారు. అందుకే దుష్పూరమైన (తీరని) కామాన్ని ఆశ్రయించి చెడ్డ పనులు చేస్తుంటారు. తమ విపరీతమైన కోరికలు తీర్చుకోవడానికి శాస్త్ర విరుద్ధమైన పనులు చేస్తుంటారు. వారి తెలివితేటలు కానీ, శక్తిసామర్థ్యాలు కానీ లోకానికి ఉపయోగపడవు. పైపెచ్చు లోక వినాశనానికి దారితీస్తాయి. ఆశల వలయంలో చిక్కుకొని అన్యాయంగా ధనాన్ని సంపాదిస్తుంటారు. ఈ రోజు ఇంత సంపాదించాను, రేపు ఇంకా సంపాదిస్తాను, ఇంకా ఇంకా సంపాదిస్తానని భావిస్తుంటారు. తమ ప్రవర్తనను వ్యతిరేకించే వారిని శత్రువులుగా భావిస్తూ వారిని అనేక రకాలుగా కష్టాలకు గురి చేస్తుంటారు. నన్ను మించిన వారు ఎవ్వరూ లేరని, నేనే బలవంతుడనని విర్రవీగుతుంటారు. ఇటువంటివారు తమ మానవ జన్మను వృథా చేసుకొని నరకం పాలవుతారు. వీరు జన్మజన్మలకు సంసార బంధంలోనే ఉంటారని, వారిని ఇంకా నీచమైన యోనులందు జన్మింపజేస్తానని కృష్ణ పరమాత్మ హెచ్చరించాడు.
ఈర్ష్య, ద్వేషం, భయం, ఉద్వేగం, కోపం వంటి వికారం లేనివారు, మానసిక, శారీరక శుభ్రత కలవారు, పక్షపాత వైఖరి లేనివారు, సుఖదుఃఖాలను సమానంగా చూసేవారు, దేనిని ఆశించనివారు, దొరికిన దానితో తృప్తి చెందేవారు తనకు అత్యంత ప్రీతిపాత్రులని పరమాత్మ వచనం. మానవజన్మ ఎత్తినందుకు ముందు మానవీయ లక్షణాలను అలవర్చుకొని మహామనీషిగా ఎదిగి తుదకు దైవస్థితికి చేరాలి. అదే మానవజన్మ పరమార్థం. అందుకే మంచిచెడుల మధ్య వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించి, ఏ మనిషి అయినా కూడా తనలో ఉండే చెడు లక్షణాలను తొలగించుకొని, మంచి లక్షణాలను పెంపొందించుకోవాలి. తనను తాను ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్దుకోవడమే నిజమైన సాధన.
–దోర్బల కుమారస్వామి