ఆశ్వయుజ మాసంలో నవరాత్ర దీక్షతో ఆదిశక్తిని ఉపాసించడం విశేష ఫలప్ర దం. రాత్రి అంటే తిథి. శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మను ఆరాధించి దశమి నాడు ఉద్వాసన చెప్పడం ఆచారం. తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అర్చించడం సంప్రదాయం. ఈ తొమ్మిది రూపాలను నవదుర్గలుగా చెబుతారు. నవరాత్రుల్లో మూడోనాడు అమ్మవారు చంద్రఘం టగా అనుగ్రహిస్తుంది. శిరస్సుపై అర్ధ చంద్రుడు ‘ఘంటాకారం’లో ఉండటం వల్ల ఆ పేరుతో పిలుస్తూ ఆరాధిస్తారు. అన్నార్థుల ఆకలితీర్చే అన్నపూర్ణగా దర్శనమిస్తుందీ తల్లి.
‘జయదేవీ మహామాయే శూలధారిణి చాంబికే
శంఖచక్ర గదాపద్మ ఖడ్గహస్తేభయ ప్రదే
పిండజ ప్రవరారూఢా చండకో పాస్త్రకైర్యుతా
ప్రసాదం తనుతేమహ్యం చంద్రఘంటేతి విశ్రుతా॥’ అని ధ్యానిస్తారు.
అమ్మవారి దేహకాంతి బంగారురంగులో అంతటా విస్తరించి ఉంటుంది. పది చేతులతో అభయ ముద్రను, వివిధ ఆయుధాలను ధరించి, సింహ వాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిస్తుంది. సింహం పరాక్రమానికి ప్రతీక. ఆయుధాలు దుష్టశిక్షణకు, అభయముద్ర శిష్టరక్షణకు సంకేతాలుగా నిలుస్తాయి. ఈమెను ఆరాధించేవారు పరాక్రమశాలురుగా, నిర్భయులుగా జీవిస్తారు. కార్యసాధకులు అవుతారు. నిరంతరం నినదించే ఘంటాధ్వానాలు దుర్మార్గుల కు భయంకరాలు కాగా, భక్తులకు అవి అభయప్రదాలై ప్రశాంతతను చేకూరు స్తాయి. అతి సౌమ్యత, అతి రౌద్రత కలిగిన చంద్రఘంట కోరిన వెంటనే ఫలితాన్నిచ్చే ‘సద్యః ఫల ప్రదాయని’. సాధకులు ఈ తల్లిని మణిపూరకంలోని కుండలినీ శక్తిగా భావించి ధ్యానిస్తుంటారు. దీనివల్ల ఆ సాధకులు దివ్యశక్తులను సాధించి అలౌకిక కక్ష్యలోకి ప్రయాణించగలిగిన సామర్థ్యాన్ని తాము పొందడ మే కాక ఇతరులకు అనుగ్రహించే శక్తినీ పొందుతారు.
నవరాత్రుల్లో నాలుగో రోజున అమ్మవారిని ‘కూష్మాండ’గా భావిస్తూ మహాలక్ష్మి గా కొలుస్తారు. ఈమె అష్టభుజిగా వివిధ ఆయుధాలు, జపమాల, కమండలం ధరించి సాధకులకు దర్శనం ఇస్తుంది. ఆయుధాలు దుష్టశిక్షణకు, జపమాల జ్ఞానానికి, కమండలం త్యాగానికి చిహ్నాలుగా చూపుతూ సాధకులు ఆ మార్గం లో నడవాలని బోధిస్తుంది. ప్రళయం తర్వాత జరిగిన బ్రహ్మాండ సృష్టికి ‘కూష్మాండ’ అధిదేవత అని పురాణాలు చెబుతున్నాయి. తన అమేయమైన తేజస్సుతో సూర్యమండలంలో, సూర్యునికి ప్రకాశాన్ని, వెలుగునూ అనుగ్రహి స్తూ జగత్తునంతా ప్రకాశింపజేసింది. సకల జీవుల అంతర్గతమైన తేజస్సు ఈమె అంశమే. కూష్మాండం అంటే గుమ్మడిపండు. గుమ్మడి ఆకృతిలో ఉండే ఈ బ్రహ్మాండాన్నంతా ఏ మాత్రం ప్రయాస లేకుండా చిరునవ్వుతో సృజించినది కాబట్టి ఈ తల్లిని కూష్మాండ అంటారు.
‘సుధా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ, దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే’ అంటూ భక్తులు అమ్మను ప్రార్థిస్తారు.
ఉదయాస్తమయాలలో కనిపించే సూర్యుడి అరుణ వర్ణం అమ్మకు ఇష్టమైనది. అరుణకాంతితో భాసించే చీరలో ప్రసన్న వదనంతో భక్తాభీష్టప్రదాయనిగా సింహవాహనంపై కొలువుదీరి ఉంటుంది. రాహు గ్రహం అనుగ్రహం వల్ల అమ్మదయను త్వరగా పొందగలుగుతారని చెబుతారు. రాహువుకు ఇష్టమైన ధాన్యం మినుములు. అందుకే ఆమెకు మినుపగారెలు, బెల్లంతో చేసిన అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. కూష్మాండాన్ని బలిగా ఇస్తారు. నిజానికి బలి అంటే అంతర్గతమైన దుష్టభావనలను నిరోధించుకునే సాధన. తనను ఆరాధించిన వారికి త్వరగా ప్రసన్నమై, భక్తులు కోరుకున్న దానికన్నా అధిక ఫలితాన్ని ఇస్తుం దీ దేవత. నవరాత్రుల సందర్భంగా కూష్మాండను శక్తికి మించి ఆరాధిస్తారు సాధకులు. ఆమె అనుగ్రహంతో ఆయురారోగ్యాలు కలగడం భౌతిక ప్రయోజ నం అయితే, అంతర్గత శత్రువుల ప్రభావం తొలగి సహస్రారంలో అమృతాస్వా దన జరగడం ఆధ్యాత్మిక విజయం.
పాలకుర్తి రామమూర్తి