వివిధ కాలాలకు చెందిన వివిధ రుషులు ‘యుగం’ అన్న పదాన్ని పలు విధాలుగా నిర్వచించారు. ‘యుగ’ అన్న ఒక్క పదమే వివిధ కాల పరిమాణాలను సూచిస్తుంది. పంచాంగం ప్రకారం చైత్ర మాసం నుంచి ఫాల్గుణం పూర్తయ్యే వరకు ఉన్న సమయాన్ని ‘యుగం’ అని అంటారు. విష్ణుసహస్ర నామం భగవంతుణ్ని ‘యుగాదికృత్’ అని సంబోధించింది. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలతో కూడిన నాలుగు యుగాలను శ్రీకృష్ణుడు తన అవతారాలలో ఆరంభిస్తాడని ఇది తెలియజేస్తుంది. కాబట్టి, ప్రస్తుత ఉగాది కలియుగ ఆరంభాన్ని సూచిస్తుంది. ద్వాపర యుగాంతంలో కృష్ణ భగవానుడు వైకుంఠానికి వెళ్లిన రోజే కలియుగం ఆరంభమైందని ప్రాచీన పండితులు వివరించారు. కలహ, కల్మషాలతో కూడిన కలియుగాన్ని ‘ఇనుప యుగం’గా అభివర్ణిస్తారు. ఈ కాలం ఎన్నో దుఃఖాలకు నిలయం అయినప్పటికీ, దీనికి అద్భుతమైన లక్షణం ఒకటుంది.
‘కలియుగం దోషసాగరమే అయినప్పటికీ, దీనిలో ఉన్న మహాగుణం ఏమిటంటే.. కేవలం హరేకృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా మనిషి భవబంధ విముక్తుడై పరంధామానికి చేరగలుగుతున్నాడు’ అని శ్రీమద్భాగవతం (12.3.51) వివరించింది. కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం. ఆ యుగ ధర్మాన్ని స్థాపించడానికి భగవంతుడు తాను ముందుగా చెప్పినట్టు ఐదువందల సంవత్సరాల కిందట శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించి హరినామ సంకీర్తన ఉద్యమానికి నాంది పలికాడు. ఈ పరమ పావనమైన ఉగాది పర్వదినం సందర్భంగా ‘ఉగాది పచ్చడి’ని శ్రీకృష్ణ భగవానుడికి నివేదించి, ప్రసాదంగా తీసుకోవాలి. ‘హరేకృష్ణ’ మహామంత్రాన్ని ప్రారంభించాలి. ఈ జపంతో మన జీవన విధానంలో అనేక ఉన్నత అభిరుచులను ఆపాదించుకోవచ్చు. ఎన్ని కష్టాలెదురైనా నిశ్చలమైన మనసుతో స్థితప్రజ్ఞుడై జీవించవచ్చు. దేవాలయ సందర్శనం, అన్నదానం, గోసేవ తదితర ధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ద్వారా శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది.
…? శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి, 93969 56984