సిద్దిపేట : జిల్లాలోని ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని బండమైలారం గ్రామ శివారులో ఉన్న కర్నూల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గడువు ముగిసిన విత్తనాలను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కంపెనీలో గడువు ముగిసిన విత్తనాలు విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి ములుగు ఎస్ఐ రంగకృష్ణ, గజ్వేల్ డివిజన్ ఏడిఏ అనిల్ కుమార్, ఏఓ ప్రగతి, మరియు పోలీసు సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించగా గడువు ముగిసిన మొక్కజొన్న విత్తనాలు, వరి ధాన్యం విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వరి ధాన్యానికి సంబంధించి 10,850 ప్యాకెట్స్, 425 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విత్తనాల విలువ రూ. ఒక కోటి 90 లక్షల 30 వేలు ఉంటుందని పోలీసులు చెప్పారు.
విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మే షాపు యజమానులపై మరియు వ్యక్తుల పై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉన్నట్లు మరియు ఎవరైనా అమ్ముతున్నట్లు సమాచారం వస్తే వెంటనే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100 కు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.