నర్సంపేట, ఏప్రిల్ 20: కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారు మంగళవారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రి వద్ద బారులు తీరారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్ను వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం వరంగల్కు పంపిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని హోం ఐసొలేషన్లో ఉంచుతున్నారు.
124 మందికి టీకాలు
చెన్నారావుపేట: మండలకేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం 124 మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారి ఉషారాణి తెలిపారు. 85 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 13 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. పీహెచ్సీలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ టీకా వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బుధవారం జరిగే శ్రీరామనవమి వేడుకలను ప్రజలు ఇండ్లలోనే చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీహెచ్వో వెంకటేశ్వరరావు, స్టాఫ్నర్సు స్వరూపారాణి, లలిత, హెల్త్ అసిస్టెంట్ కుండె శివాజీ, సూపర్వైజర్ రామెల్, ఆరోగ్యమిత్ర ఆరె మహేందర్ పాల్గొన్నారు.
టీకాపై అపోహలు వద్దు
దుగ్గొండి: కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ వేసుకోవాలని, టీకాపై అపోహలు వద్దని మండలకేంద్రంలోని పీహెచ్సీ వైద్యాధికారి రాజు కోరారు. దవాఖానలో 80 మందికి కరోనా టీకాలు వేశారు. అరగంటపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచా రు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది వెంకటేశ్వర్లు, సాంబయ్య, రెహమాన్, చాణక్య, సబిత పాల్గొన్నారు.
కరోనా కట్టడికి సర్కారు కృషి
నల్లబెల్లి: రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి బానోత్ సంగూలాల్ అన్నారు. మండలకేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారి మహేందర్నాయక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వ్యాక్సిన్ వేసుకోవాలి
నర్సంపేట రూరల్: ప్రజలు విధిగా కొవిడ్-19 వ్యాక్సిన్ వేసుకోవాలని ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ ఎస్ పద్మ అన్నారు. భాంజీపేట పీహెచ్సీలో కరోనా టీకాలు వేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పద్మ, పీహెచ్సీ వైద్యాధికారి భూపేశ్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో 45 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.
కరోనా పరీక్షలు చేయించుకోవాలి
దామెర: ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎంపీపీ కాగితాల శంకర్ కోరారు. మండలంలోని ల్యాదెళ్లలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 51కి చేరింది. ఈ సందర్భంగా ఎంపీపీ, తహసీల్దార్ రియాజొద్దీన్, పీహెచ్సీ వైద్యురాలు శిరీష, ఎస్సై భాస్కర్రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు గ్రామంలోని వార్డు సభ్యులు, ముఖ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామంలో కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో సర్పంచ్ కే శ్రావణ్య-అనిల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.