ప్రపంచంలో ప్రతి మనిషిలోనూ భయం ఉంటుంది. జీవితంలో అడుగడుగునా కాస్తో కూస్తో భయం వెంటాడుతూనే ఉంటుంది. ఏ రూపంలో అయినా భయం ప్రభావం మనిషిపై ఉంటుంది. అయితే, దానిగురించి ఆలోచించాలే కానీ, చింతించొద్దు. మనసులో గూడుకట్టుకున్న భయం గురించి చింతించే కొద్దీ అది మరింత ముదురుతుంది. చింతన చేస్తే ఆ చింత దూరమవుతుంది. మానవాళికి భగవద్గీత అనేక లక్షల సంవత్సరాలుగా లభిస్తున్నది, అయితే కాలక్రమంలో ప్రాచుర్యం తగ్గినట్లు కనిపించడంతో శ్రీకృష్ణ భగవానుడు దానిని ఐదువేల ఏండ్ల కిందట కురుక్షేత్ర రణరంగంలో మరోసారి ఉద్బోధించాడు. మానవ సహజంగానే అర్జునుడికి యుద్ధరంగానికి రాగానే భయం కలిగింది. అయితే ఆ భయం పిరికివాళ్లకు కలిగే భయం లాంటిది కాదు. ఎంతో అవగాహనతో కూడుకున్నది.
ఏ రకమైనా, భయం భయమే కదా! తన బంధువులనే చంపి రాజ్యం సంపాదిస్తే, తాము అనుభవించేది బంధురక్తంతో తడిసినదే అవుతుందని అర్జునుడి భయం. యుద్ధ పరిణామాల వల్ల ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతాయని భయం. స్త్రీలు ఇబ్బందుల పాలవుతారని భయం. ఇలా అనేకరకాల భయాలతో కంపించిపోయిన అర్జునుడి శరీరం వేడెక్కింది, నోరు ఎండిపోయింది, ధనుస్సు చేజారి పడిపోయింది. తానిక యుద్ధం చేయలేనని ఖండితంగా చెప్పేశాడు. ఇదే గీతా సందేశానికి నాంది అయింది. అంటే భయపడినవారికి, ఆ భయం నుంచి దూరం కావాలనుకున్నవారికీ గీతా సందేశం.
మానవ జీవితంలో అనేకానేక దశలలో, స్థితులలో నానారకాల భయాలు చుట్టుముడుతుంటాయి. ఎవరికి వాళ్ళు తమ భయాలను తొలగించుకోవాలే గాని ఎవ్వరూ దానికి తోడ్పడలేరు. ఎవరి ఆకలిని వారే తీర్చుకోవాలి, అలాగే ఎవరి భయాన్ని వాళ్లే తొలగించుకోవాలి. అర్జునుడి భయాన్ని చూసి శ్రీకృష్ణభగవానుడు ‘నీచమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి లే’ అని పలికాడు. ‘అసలు భయం వద్దే వద్దు’ అని గీతా బోధకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత వెంటనే ఆ దేవదేవుడు ఆత్మతత్త్వాన్ని తెలియజేశాడు. మనిషికి మానసికస్థితిలో భయం వేస్తుంది, ఆత్మస్థితిలో భయం తొలగిపోతుంది. అందుకే భగవద్గీత ఆత్మతత్త్వంతో మొదలై కర్తవ్యబోధకు దారితీస్తుంది. తర్వాత అంచెలంచెలుగా భగవంతుడు అర్జునుడికి కర్మయోగాన్ని, భక్తియోగాన్ని, జ్ఞానయోగాన్ని బోధించి చివరకు ‘మా శుచః’- భయపడకు అనే మాటతో గీతోపదేశాన్ని ముగించాడు. ‘భయం వద్దేవద్దు’తో మొదలైన భగవద్గీత ‘భయపడకు’ అనే మాటతో ముగుస్తుంది. దీన్నిబట్టి చూస్తే గీత చరమోపదేశం మనిషిని భయం నుంచి దూరం చేయడానికే అని స్పష్టమవుతుంది.
భయం కలిగినప్పుడు మనిషి కర్తవ్య విమూఢుడు అవుతాడు. అంటే చేయవలసిన పనేమిటో అర్థం కాని స్థితిలో పడిపోతాడు. అదే భయానికి గుర్తు. భయానికి విరుగుడు కార్యంలో దూకడమే. మరి, భయంతో ఉన్నా కార్యరంగంలో దూకేవాడు ఎవరు? ఎవరైతే భగవద్గీతతో ఆత్మస్థితిలో నిలుస్తాడో అతడే కార్యంలో నిమగ్నుడవుతాడు. గీతాజ్ఞానం విన్న తర్వాత అర్జునుడు తన మోహం పోయిందని, సందేహాలు తొలిగాయని, మనసు స్థిమితపడిందని, ఇక తనకు ఆదేశించిన ప్రకారమే కార్యం చేస్తానని పలికాడు. దానితో గీతోపదేశం సఫలమైంది. ఆత్మధైర్యంతో యుద్ధం చేసిన అర్జునుడిని విజయం వరించింది. అందుకే అర్జునుడు చిరస్థాయిగా విజయుడనే పేరుతో అలరారుతున్నాడు. కనుక జీవితంలో ఏ స్థితిలో ఉన్నవారైనా భగవద్గీతను నిపుణుల మార్గదర్శకత్వంలో అనుసరిస్తూ భయాన్ని జయించాలి. విజయులై వర్ధిల్లాలి.
–డా॥వైష్ణవాంఘ్రి సేవకదాస్
98219 14642