ఖమ్మం రూరల్, జూన్ 02 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు వివిధ రకాల పతకాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం చిన్నతండ గ్రామానికి చెందిన బానోత్ జానయ్య (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) కు “కఠిన సేవా పతకం” దక్కింది. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వహించడం, ఉగ్రవాద, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించడం, ఏజెన్సీ ప్రాంతాలు, ప్రమాదకర పరిస్థితుల్లో ధైర్యసాహసాలు, నిబద్ధత, బాధ్యతాయుతమైన పనితీరు కనబరచినందుకు రాష్ట్ర ప్రభుత్వం జానయ్య సేవలను గుర్తించింది.
2014 బ్యాచ్ కి చెందిన బానోత్ జానయ్య తన మొదటి సర్వీసును ఉగ్రవాద వ్యతిరేక ప్రత్యేక దళమైన ఆక్టోపస్లో సుమారు 5 సంవత్సరాలు సేవలందించారు. అనంతరం నక్సలిజం వ్యతిరేక ప్రత్యేక దళమైన గ్రేహౌండ్స్లోనూ విధులు నిర్వహించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లోని అత్యంత క్లిష్టమైన, సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో దీర్ఘకాలం సమర్థవంతంగా సేవలందించారు. నిజాయితీ, క్రమశిక్షణ, విధి పట్ల అంకితభావం, శాంతి భద్రతల పరిరక్షణలో విశేష కృషి, అలాగే కఠిన ప్రాంతాల్లో సమర్థవంతమైన సేవలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక పతకాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా చిన్నతండ గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, మిత్రులు, సహచర పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ జానయ్యకు అభినందనలు తెలియజేశారు.