ప్రతి వ్యక్తీ తన జీవితం అంతా బాగుండాలని, ఏ లోటూ రాకూడదని అనుకుంటాడు. జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ, ఆ ఉన్నతస్థితి పొందే మార్గం మంచిదై ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా ఉండాలి. అలాంటి సన్మార్గంలో ప్రయాణించాలంటే అందుకు మంచి అలవాట్లు, వైఖరి అవసరం. సత్యం, అహింసా, ధర్మం వంటి సద్విషయాలు అభ్యసించాలంటే నిరంతర ప్రయత్నం కొనసాగాలి. ఆశలు, కోరికలు అందరికీ ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే క్రమంలో మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. అవసరార్థం అస్తిత్వాన్ని తాకట్టుపెడితే అది నీచ సంస్కారంగా పరిణమించి వ్యక్తిగతంగా మనిషిని మరింత పతనం చేస్తుంది.
మనిషి పశ్చాత్తాపం పొందడం ఎవరి వల్లనో రాదు. తనకు తానే ఆ పరిస్థితిని కల్పించుకుంటాడు. తప్పు అని తెలిసినా అదే దారిలో ప్రయాణిస్తాడు. పైగా తప్పదని బుకాయిస్తూ ఆత్మవంచన చేసుకుంటాడు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటే అప్రయత్నంగా కూడా తప్పుడు మార్గంలోకి వెళ్లడు. ఈ వ్యక్తిత్వ నిర్మాణం కూడా మన చేతుల్లోని పనే! తీసుకునే ఆహారం, స్నేహితులు, నివసించే పరిసరాల వంటివన్నీ మన వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతూ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపైన మాత్రమే కాదు, మానసిక స్థితిపైనా ప్రభావం చూపుతుంది. ఆకలిని జయించడానికి తీసుకునే ఆహారం.. ఆరోగ్యాన్ని నిలబెట్టేదై ఉండాలి కానీ, అనారోగ్యాన్ని కల్పించేది కాకూడదు. ఆహారం ద్వారానే మనిషిలో తమో, రజో గుణాలు ప్రేరేపితం అవుతాయి. సాత్వికాహారం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
వ్యక్తి జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసే వ్యక్తుల్లో స్నేహితులు ముఖ్యులు. ‘నీ స్నేహితులు ఎవరో చెబితే.. నువ్వేంటో చెప్పవచ్చు’ అన్న నానుడి తెలిసిందే! స్నేహాలు మన ఉన్నతికి దోహదం చేయాలి. కొన్ని స్నేహాలు బుద్ధిని మంచివైపు ప్రేరేపిస్తాయి. ఇంకొన్ని చెడువైపు మళ్లిస్తాయి. జీవనయానంలో స్నేహితులది కీలక పాత్ర. మనలో వస్తున్న మార్పుల ఆధారంగా మన స్నేహితుల వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రామాయణంలో రాముడితో మైత్రి సుగ్రీవుడికి వరమైంది. మహాభారతంలో దుర్యోధనుడి స్నేహం కర్ణుడికి శాపంగా పరిణమించింది. మంచి స్నేహాలను ఎంచుకోవడం, నీచ స్నేహాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. సత్ సాంగత్యం ఎప్పుడూ మన ఉన్నతికి దోహదం అవుతుంది. చెడు స్నేహితులు వాళ్లు ఎదుగుతూ మనల్ని కూలదోస్తారు. మంచి వ్యక్తులతో స్నేహం వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది అవుతుందని గుర్తెరగాలి. ఆ స్నేహితులు ఆధ్యాత్మికపరులైతే మనలోనూ అవే భావాలు మొలకెత్తి చిగురిస్తాయి.
వ్యక్తిత్వ వికాసంలో మరో అంశం పరిసరాలు. మనం ఉంటున్న ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు కూడా వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. శారీరకంగా పరిశుభ్రంగా ఉంటేనే, మానసికంగానూ ప్రశాంతంగా ఉండటం తేలికవుతుంది. మనం నివసించే పరిసరాలు శుచిగా, పవిత్రంగా ఉంచుకోవాలి. మన గదులను మహాత్ములు, దేవీదేవతల చిత్రాలతో అలంకరించుకోవాలి. అవి మనసులను శుద్ధి చేసుకోవడానికి ప్రేరేపిస్తాయి. ఉన్నత శిఖరాలను అధిరోహించడం అనుకున్నంత తేలిక కాదు. దానికి శారీరకంగా, మానసికంగా శ్రమించాల్సి ఉంటుంది. మనిషి మనసు చెడువైపు ప్రయాణించినంత వేగంగా మంచివైపు మళ్లదు. మంచివైపు అడుగులు వేయడం కష్టమైన పని! కానీ, పతనపు లోయల వైపు పయనించడం చాలా సులభం. అలా దిగజారిపోకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలంటే పైన పేర్కొన్న ఈ మూడు విషయాలలో మనం జాగ్రత్త పడితే జీవితం సంస్కారవంతం అవుతుంది. సారవంతంగా నడుస్తుంది.
కనుమ ఎల్లారెడ్డి
93915 23027