మణుగూరు : మండల పరిధిలోని ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కలకలం రేపింది. గుట్టమల్లారం పంచాయతీకి చెందిన ఎల్లబోయిన రాము(24) పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అటవీ ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ నరేశ్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల నుంచి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు అవివాహితుడు కాగా అతనికి తల్లి, చెల్లి ఉన్నారు.