బొంరాస్పేట: చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతైన సంఘటన బొంరాస్పేట మండలంలో చోటు చేసుకుంది. బుర్రితండాకు చెందిన మాణిక్య నాయక్ కొడుకు పోమ్యానాయక్(26) గురువారం రాత్రి 9 గంటలకు చేపల వేట కోసం ఇంటి నుంచి వెళ్లాడు. శుక్రవారం ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్ద వెతికారు. చెరువు గట్టుపై పోమ్యానాయక్ బట్టలు, చెప్పులు కనిపించడంతో చెరువులో రోజంతా గాలించినా సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు.
కొడంగల్ సీఐ అస్సయ్య, ఎస్ఐ వెంకటనారాయణ, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు దేశ్యానాయక్, రెవెన్యూ అధికారులు చెరువు వద్దకు చేరుకుని గల్లంతైన యువకుడి వివరాలు సేకరించారు. తరువాత కోట్పల్లి నుంచి గజ ఈతగాళ్లను తెప్పించి గల్లంతైన యువకుని కోసం గాలింపు చేపట్టారు. పోమ్యానాయక్ బతుకుదెరువు కోసం ముంబాయికి వెళ్లి నెల రోజుల కిందటే తండాకు వచ్చాడు. కొడుకు ఆచూకీ దొరకకపోవడంతో భార్య, పిల్లలు ఆందోళనలో ఉన్నారు.