ముంబై : దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్లు ఇటీవల విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. సైబర్ నేరాలపై (Cyber Fraud) పోలీసులు, అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నా నేరగాళ్లు ఆన్లైన్ వేదికగా చెలరేగుతున్నారు. అమాయకులను అందినకాడికి అడ్డంగా దోచేస్తున్నారు. నకిలీ జాబ్ ఆఫర్ల నుంచి క్రిప్టోకరెన్సీ స్కామ్స్ వరకూ రోజుకో తరహా స్కామ్తో బాధితులను దోచేస్తున్నారు. తాజాగా థానేకు చెందిన మహిళను స్కామర్లు రూ. 5.24 లక్షలకు మోసగించారు. 24 ఏండ్ల థానే మహిళకు ఇటీవల ఫోన్ చేసిన స్కామర్ తాను ప్రముఖ బ్యాంక్ ఉద్యోగినని చెప్పుకున్నాడు.
బ్యాంక్ క్రెడిట్ కార్డు డిపార్ట్మెంట్లో తాను పనిచేస్తానని నమ్మబలికాడు. ఆమె హెల్త్ ఇన్సరెన్స్ పేమెంట్ బకాయి ఉందని మహిళకు చెప్పాడు. దీనిపై ఎలా వ్యవహరించాలని మహిళ కోరగా తాను షేర్ చేసిన ఏపీకే ఫైల్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరాడు. ఆమె ఫైల్ను డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఆమె ఖాతా నుంచి రూ. 5.24 లక్షలు డెబిట్ అయ్యాయి.
మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు వాడిన యాప్ ద్వారా సున్నిత సమాచారాన్ని రాబట్టి స్కామర్లు ఈ వంచనకు పాల్పడిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :