హైదరాబాద్ : అత్తాపూర్ పరిధిలోని చింతల్మెట్లో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్లో గుర్తు తెలియని యువతి అనుమానాస్పద మృతి చెందింది. అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్ నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు.
అపార్ట్మెంట్ వద్దకు వచ్చిన పోలీసులు.. ఆ ప్లాట్ తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. కుళ్లిపోయిన స్థితిలో యువతి మృతదేహాం ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. అదే గదిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ యువతిని ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్యకు పాల్పడిందా? అనే విషయాలు తేలాల్సి ఉంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.