వికారాబాద్ : కట్టుకున్న భార్యను రోకలితో కొట్టి చంపాడు భర్త. ఈ దారుణ ఘటన బొంరాస్పేట మండలం ఏర్పుమళ్లలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఏర్పుమళ్లకు చెందిన బర్ల పెంటమ్మ(30), నర్సింలు భార్యాభర్తలు. వీరిద్దరి మధ్య గత కొద్ది రోజుల నుంచి గొడవలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం రాత్రి కూడా భార్యాభర్తలిద్దరికీ తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోయిన భర్త.. భార్య తలపై రోకలి బండతో బాదాడు. దీంతో పెంటమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
స్థానికులు మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నర్సింలును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.