ముంబై : తండ్రి ఫ్లాట్ను విక్రయించే ప్రతిపాదనను నిరాకరించిందనే ఆగ్రహంతో స్వయంగా సోదరుడే అవివాహిత సోదరికి నిప్పంటించిన ఘటన మహారాష్ట్రలోని పుణేలో వెలుగుచూసింది. బాధితురాలు రాజశ్రీ పతాంగె (48) ఈ ఘటనలో 50 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతుండగా నిందితుడు శ్యామ్ మనోహర్ (45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం శ్యామ్ తన కుటుంబంతో కలిసి పుణేలోని బిబ్వేవాడి ప్రాంతంలో అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు.
ఇక రాజశ్రీ అదే ప్రాంతంలో మరో సోదరుడితో కలిసి ఉంటోంది. చనిపోయిన తండ్రి ఫ్లాట్ను అమ్మి వాటా తీసుకుందామని శ్యామ్ కోరగా అందుకు రాజశ్రీ నిరాకరించింది. దీంతో ఈ విషయం మాట్లాడాలని రాజశ్రీ ఫ్లాట్కు వచ్చిన శ్యామ్ ఆమెతో ఘర్షణ పడి ఆగ్రహంతో సోదరి అని కూడా చూడకుండా ఆమెకు నిప్పంటించాడు. ఈ సమయంలో రాజశ్రీ మరో సోదరుడు అక్కడ లేడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా శ్యామ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.