జైపూర్ : ఇద్దరు యువతులను నలుగురు వ్యక్తులు బెదిరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాజస్ధాన్ లోని జైపూర్ జిల్లాలో వెలుగుచూసింది. బాధితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు బుధవారం సాయంత్రం ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…జూన్ 1న అక్కాచెల్లెళ్లు నివసించే అపార్ట్ మెంట్ కు వారికి కొంతకాలంగా పరిచయం ఉన్న అతల్, పంకజ్ లు వచ్చారు.
అక్కడి నుంచి యువతులను వారు లునియవస్ ప్రాంతంలోని ఇంటికి తీసుకువెళ్లారు. అతల్, పంకజ్ లతో పాటు మరో ఇద్దరు వారి స్నేహితులు కలిసి ఇద్దరు యువతులను దారుణంగా హింసించి లైంగిక దాడికి తెగబడ్డారు. నిందితుల్లో ఇద్దరు తమకు తెలిసిన వారే కావడంతో వారితో కలిసి వెళితే దారుణానికి పాల్పడ్డారని అక్కా చెల్లెళ్లు పేర్కొన్నారు. బాధిత యువతులకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.