అనంతపురం :అనంతపురం జిల్లాలో ఓ పెళ్లిఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెండ్లి బాజాలు మధ్య సంతోషంగా గడిపిన కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. అనారోగ్యంతో తల్లి చనిపోతే, అతి తట్టుకోలేక కొడుకు ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో జరిగింది. కొర్రపాడుకు చెందిన వెంకటస్వామి (56) పామిడి పోలీసుస్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. శనివారం కుమారుడు గోవర్ధన్ వివాహం జరిగింది.
అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబం ఇంటి పెద్దలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయింది.పెళ్లి కుమారుడి నాయనమ్మ వెంకటస్వామి తల్లి కోన్నమ్మ(70) అనారోగ్యంతో అనంతపురంలోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వివాహం పూర్తయిన కొద్ది సేపటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. తల్లి మరణ వార్త విని ఆమె కుమారుడూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.