ఎదులాపురం : బంగారు పూత పూసిన నకిలీ ఉంగరాలను కుదువపెట్టి నగదు రుణం పొందుతున్న ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. బుధవారం స్థానిక వన్ టౌన్లో సీఐ. రామకృష్ణ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జైనూర్ మండలం ఉసేగావ్ గ్రామానికి చెందిన మోయితే రమేశ్, నితిన్ పలు ధపాలుగా నకిలీ బంగారు ఉంగరాలతో రుణం పొందారు. మరికొన్ని ఉంగరాలను తీసుకురాగా అనుమానం వచ్చిన సిబ్బంది వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా నకిలీవని గుర్తించారు. మణప్పురం బంగారు రుణం ఫైనాన్స్ సంస్థ మేనేజర్ గారిపల్లి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బుధవారం మధ్యాహ్నాం రోడ్డుపై తనిఖీలు చేస్తుండగా అనుమానంతో రమేశ్, నితిన్లను అదుపులోకి తీసుకుని విచారించారు.
అసలు నిజాన్ని నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు . ప్రధాన సూత్రధారి అయిన ఇంద్రవేల్లి గ్రామానికి చెందిన ఉదావత్ శుభం నకిలీ ఉంగరాలపై బంగారు పూత పూసి ఇద్దరు స్నేహితులైన మోయితే రమేశ్, నితిన్లకు ఇచ్చి మోసపూరితంగా రుణంపొందాడని పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి 10 గ్రాముల రెండు బంగారు పూత రింగులు, రూ.17వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రమేశ్,నితిన్లను అరెస్టు చేయగా మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు జి.అప్పారావు, ముజీబ్ తదితరులుఉన్నారు.