జహీరాబాద్/ సంగారెడ్డి : ఈత సరదా ఇద్దరు బాలుర ప్రాణాలను బలి తీసుకుంది. చెక్ డ్యాంలో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సజ్జరావుపేట తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సజ్జరావుపేట తండాకు చెందిన అరవింద్ (10) బలరాం (11) బుధవారం ఈత కొట్టేందుకు చెక్ డ్యాంలో దిగారు.
లోతు ఎక్కువగా ప్రాంతంలో దిగడంతో అందులో మునిగి చనిపోయారు. ఇద్దరు బాలురు మృతి చెందడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు జహీరాబాద్ రూరల్ ఎస్ఐ రవి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.