Suicide : ఓ కాలేజీ విద్యార్థి (College Student) ని తాను అద్దెకు ఉంటున్న గదిలో ఆత్మహత్య (Suicide) కు పాల్పడింది. చనిపోయే ముందు ఆమె తన గది గోడపై చాక్పీస్తో రాసిన సూసైడ్ నోట్ (Suicide Note) కలకలం రేపుతోంది. తన చావుకు తన తండ్రి, నాన్నమ్మే కారణమని ఆ సూసైడ్ నోట్లో విద్యార్థిని పేర్కొన్నది. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) లోని నెహ్రూ నగర్ ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాధితురాలిని రాజ్గఢ్ జిల్లాకు చెందిన వైష్ణవి బనావడే (20) గా గుర్తించారు. ఆమె ఇండోర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువు నిమిత్తం ఎంఐజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్లో అద్దె గదిలో ఒంటరిగా ఉంటోంది. వైష్ణవి గత ఏడాదిగా ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.
శనివారం రాత్రి ఆమె ప్రియుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వైష్ణవి స్పందించలేదు. దాంతో అనుమానం వచ్చి అతను నేరుగా ఆమె గదికి వెళ్లాడు. లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో ఇంటి యజమాని సహాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. వైష్ణవి ఫ్యాన్కు ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
గోడపై చాక్పీస్తో మృతురాలు రాసిన సూసైడ్ నోట్ను రికార్డు చేసుకున్నారు. “నాకు నా తల్లి, సోదరుడు, ప్రియుడు అంటే చాలా ఇష్టం. కానీ నాన్న, నాన్నమ్మ ప్రవర్తన వల్లే చనిపోతున్నా” అని సూసైడ్ నోట్లో రాసి ఉంది. ఈ ఘటనపై ఎంఐజీ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. గోడపై రాసిన నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కుటుంబసభ్యులను విచారించిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.