Live-In Relationship | ముంబైలో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న సహచరిని ఓ వ్యక్తి దారుణంగా చంపి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన విషయం తెలిసిందే. ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య తరహాలో జరిగిన ఈ ఘటనలో విచారణ సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ మహిళను తాను హత్య చేయలేదని, ఆమే ఆత్మహత్య చేసుకుందని నిందితుడు మనోజ్ సానే విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపాడు. అంతేకాకుండా మృతురాలు సరస్వతితో తనకు శారీరక సంబంధం లేదని, ఆమెను తాను కుమార్తెలా చూసుకున్నానని నిందితుడు చెప్పినట్లు సమాచారం.
ముంబై శివారులో బుధవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మనోజ్ సానే (56), సరస్వతి వైద్య (36) గీతా నగర్లోని ఓ అపార్ట్మెంట్లో మూడేళ్లుగా కలిసే ఉంటున్నారు. అయితే, వారు నివసిస్తున్న ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫ్లాట్ వద్దకు చేరుకొని తలుపులు బద్దలు కొట్టి పరిశీలించగా దిమ్మ తిరిగే దృశ్యాలు కనిపించాయి. మూడు బకెట్లలో రక్తంతో నిండిన మాంసపు ముద్దలు, సగం కాలిన ఎముకలు కనిపించాయి. మృతురాలి జుట్టు నేల పైన కనిపించింది. పోలీసులను చూసి మనోజ్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతడిని అరెస్ట్ చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు ఈ నెల 16 వరకు రిమాండ్ విధించింది.
కేసు విచారణలో భాగంగా నిందితుడు చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తానొకహెచ్ఐవీ బాధితుడినని.. చాలా ఏళ్ల క్రితమే ఈ వ్యాధి బారిన పడినట్లు మనోజ్ పోలీసులకు చెప్పాడు. ‘సరస్వతితో నాకు శారీరక సంబంధం లేదు. ఆమెను నేను కుమార్తెలా చూసుకున్నాను. జూన్ 3వ తేదీన నేను బయటకు వెళ్లాను. తిరిగి ఇంటికొచ్చి చూడగా సరస్వతి నేలపై పడి ఉంది. దగ్గరకెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉంది. దీంతో ఈ కేసులో నేను ఇరుక్కుంటానేమో అన్న భయంతో ఆమె మృతదేహాన్ని కనిపించకుండా చేయాలనుకున్నా. ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన గురించి తెలుసుకుని అదే తరహాలు సరస్వతి మృతదేహాన్ని ముక్కలు చేశాను. ఇందుకు ట్రీ కట్టర్ను ఉపయోగించి ఎముకలు, శరీర భాగాలను వేరు చేశాను. ఆ తర్వాత వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించా. కొన్ని శరీర భాగాలను బయట పడేశా’ అని నిందితుడు పోలీసులకు తెలిపాడు.
కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. నిందితుడు మనోజ్ తెలివైన నేరస్థుడని.. దర్యాప్తుకు సహకరించడం లేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిందితుడు చాలాసార్లు సొంత వాంగ్యూలాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు చెప్పారు. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. నిందితుడి ఫ్లాట్ నుంచి మహిళ శరీరభాగాలను స్వాధీనం చేసుకొని వాటిని ఫోరెన్సిక్ విభాగానికి పంపించినట్లు చెప్పారు.
Also Read..
Coal Mine | బొగ్గు గనిలో ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు మృతి
Odisha Train Accident | రైలు ప్రమాద మృతదేహాలను పెట్టిన స్కూల్ కూల్చివేత