షాద్నగర్ : మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో దారిదోపిడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు జైలుపాలయ్యారు. లారీని మరో డీసీఎం వ్యాన్తో అడ్డగించి, లారీ డ్రైవర్, మరో డ్రైవర్ను చితకబాది, వారి నుంచి నగదు, ఫోన్తో మూడు రోజుల క్రితం ఉడాయించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను షాద్నగర్ ఏసీపీ కుషల్కర్ వివరించారు. తమిళనాడు రాష్ట్రం తిరునమలై జిల్లా కలంపూర్ గ్రామానికి చెందిన పెరుమల్ పార్తివన్ అనే డ్రైవర్, మరో డ్రైవర్ మురుగన్తో కలిసి తమ లారీలో పీవీసీ పైపులను నింపుకొని పటాన్చెరువు ప్రాంతానికి ఈ నెల 1న బయలుదేరారు. ఇందులో భాగంగానే లారీ షాద్నగర్ పట్టణ శివారులోకి రాగానే ఆపారు.
అక్కడ నాందేడ్ పట్టణానికి చెందిన మహ్మద్ మోసిన్, మహ్మద్ వసీం, మహ్మద్ ఇబ్రహీం, షేక్ ముజాయిద్లతో పాటు మరో వ్యక్తి పచ్చి మిరపకాయల సంచులను తీసుకెళ్లేందుకు మహాబూబ్నగర్ వైపు వెళ్తు లారీ డ్రైవర్ను నీళ్లు కావాలని అడిగారు. నీళ్లను ఇచ్చెందుకు ప్రయత్నిస్తున్న లారీ డ్రైవర్ను డీసీఎంలో ఉన్న నలుగురు వ్యక్తులు అడ్డగించి ఇనుప రాడ్తో దాడిచేశారు. అనంతరం అదే లారీలో కొత్తూరు జంక్షన్ వరకు ఇద్దరు డ్రైవర్లపై దాడిచేసుకుంటు వెళ్లారు. అక్కడే లారీని వదిలి దాడికి పాల్పడిన నలుగురు మరో వాహనంలో హైదరాబాద్ వైపు వెళ్లిపోయారు. ఈ దాడిలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. వారి నుంచి రూ. 9వేల నగదు, సెల్ ఫోన్ను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపగా డీసీఎంలో వచ్చిన ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు.
సంఘటన స్థలంలో సీసీ కెమరాలను పరిశీలించగా డీసీఎం వ్యాన్ నెంబర్ కనిపించింది. డీసీఎం వ్యాన్ నెంబర్ ఆదారంగా వివరాలను రాబట్టడంతో దాడికి పాల్పడిన వ్యక్తులను వివరాలను తెలుసుకున్నామన్నారు. అదే విధంగా బుధవారం కొత్తూరు వైపు నుంచి షాద్నగర్ వస్తున్నట్లు తెలుసుకొని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేవలం డీసీఎం వ్యాన్లో వచ్చిన ఆ నలుగురు స్నేహితులు ఖర్చుల కోసం, మద్యం సేవించేందుకు డబ్బులు అవసరం ఉండటంతో లారీని అడ్డగించి డ్రైవర్లపై దాడికి పాల్పడినట్లు విచారణలో తెలిందని చెప్పారు. కేసు ఛేదనలో షాద్నగర్ సీఐ నవీన్కుమార్, ఎస్ఐలు సుందరయ్య, సురేష్, పలువురు సిబ్బంది ఉత్తమ ప్రతిభ చూపినందుకు అభినందించారు.