బెంగళూరు : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కూలీలలో వెళ్తున్న ట్రక్కు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బెలగావిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఏడుగురు కూలీలు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ప్రాణాలు వదిలారు. ఎనిమిది మందికి గాయాలవగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోకాక్ తాలూకలోని అక్కాతంగియార హలా గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు బెలగావికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బెలగావిలోని కనబరగి గ్రామం వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బళ్లారి నాలాలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో వాహనంలో చిక్కుకుపోయిన వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను వెలికి తీశారు. బెలగావి పోలీస్ కమిషనర్ ఎంబీ బోర లింగయ్య ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు కర్నాటక పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నట్లు వివరించారు.