లక్నో : ఉత్తరప్రదేశ్ మెయిన్పురిలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ రోడ్డుపక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇంట్లో ఇద్దరితో పాటు లారీలో ఉన్న మరో ఇద్దరు సైతం ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భారీ లోడ్తో వెళ్తున్న ట్రక్కు అకస్మాత్తుగా అదుపు తప్పి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆ ఇంట్లో రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్, ఆయన భార్య నిద్రిస్తున్నారు.
ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో ట్రక్కులో ఐదుగురు ఉండగా.. ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని మెయిన్పురి ఎస్పీ కమలేష్ దీక్షిత్ పరిశీలించారు. ప్రస్తుతం శిథిలాల కింద ఒకరిద్దరు చిక్కుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే, ట్రక్కు డ్రైవర్ వేగంగా నడిపాడా?.. తాగి ఉన్నాడా? అనే కోణం పోలీసులు విచారణ జరుపుతున్నారు.